గల్ఫ్‌లో ఏపీ వాసుల్ని ఆదుకోండి: కేంద్ర విదేశాంగ మంత్రికి జగన్ లేఖ

By Siva KodatiFirst Published May 13, 2020, 6:21 PM IST
Highlights

కువైట్‌లో చిక్కుకుపోయిన రాష్ట్రానికి చెందిన వలస కార్మికులును స్వదేశానికి రప్పించేందుకు అవసరమైన విమానాలు ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్.. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు బుధవారం లేఖ రాశారు

కువైట్‌లో చిక్కుకుపోయిన రాష్ట్రానికి చెందిన వలస కార్మికులును స్వదేశానికి రప్పించేందుకు అవసరమైన విమానాలు ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్.. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు బుధవారం లేఖ రాశారు. వలసకార్మికుల కోసం విశాఖపట్నం, విజయవాడ, తిరుపతికి నేరుగా విమానాలు ఏర్పాటు చేయాలని జగన్ కోరారు.

విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయలను వెనక్కి రప్పించేందుకు ‘వందే భారత్‌’ మిషన్‌ పేరుతో మీరు చేపడుతున్న చర్యలు ప్రశంసనీయమన్నారు. పలు దేశాల్లో చిక్కుకుపోయిన వేలాది భారతీయులు వందే భారత్‌ మిషన్‌ను సద్వినియోగం చేసుకుని సొంత ఖర్చులతో స్వదేశానికి తిరిగి వస్తున్నారని జగన్ చెప్పారు.

అదే కోవలో గల్ఫ్‌ దేశాల్లో ఉపాధి కోల్పోయి, అక్కడే చిక్కుకుపోయిన వేలాది వలస కార్మికులు కూడా స్వదేశానికి తిరిగి రావడానికి ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారని సీఎం చెప్పారు. అయితే వారంతా స్వదేశానికి రావడానికి అయ్యే ప్రయాణ ఖర్చు భరించే స్థితిలో లేరని జగన్ అన్నారు.

Also Read:కరోనా స్పెషల్.. కొత్త బస్సులను రూపొందించిన ఏపీఎస్ఆర్టీసీ, ప్రత్యేకతలివే..!!

కువైట్‌లో ఆమ్నెస్టీ ద్వారా స్వదేశానికి రావడానికి అనుమతి పొందిన సుమారు 2500 మంది వలస కూలీలు వారి ప్రయాణ ఛార్జీలు చెల్లించలేని స్ధితిలో ఉన్నారని జగన్ కేంద్రమంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

ఇమ్మిగ్రేషన్‌ రుసుము మాఫీ చేయడంతో  ద్వారా మన దేశ రాయబార కార్యాలయం, వారందరికీ ఎగ్జిట్‌ క్లియరెన్స్‌ కూడా ఇచ్చిందని సీఎం అన్నారు. మరోవైపు వారి ప్రయాణ ఖర్చును భరించడానికి కువైట్‌ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.

ప్రస్తుతం వారంతా అక్కడ స్థానికంగా ఏర్పాటు చేసిన శిబిరాల్లో తలదాచుకుంటున్నారని జగన్ చెప్పారు. కనీస సదుపాయాలు కూడా లేకుండా రెండు వారాల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతూ, స్వదేశానికి తిరిగి రావాలని ఆశతో ఎదురు చూస్తున్నారని సీఎం తెలిపారు.

Also Read:కంగారు పడొద్దు.. మీ వంతు వచ్చే వరకు వెయిట్ చేయండి: వలస కార్మికులకు పేర్నినాని భరోసా

వెంటనే కువైట్‌ హైకమిషనర్‌కు సూచించి, అక్కడి అధికారులతో మాట్లాడి కువైట్‌ నుంచి రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతికి నేరుగా విమానాలు ఏర్పాటు చేసేలా చూడాలని సీఎం అన్నారు.

వలస కూలీలందరినీ ఇక్కడ సొంత రాష్ట్రంలో రిసీవ్‌ చేసుకుని, వారికి అవసరమైన వైద్య పరీక్షలు చేయడం, క్వారంటైన్‌కు పంపించడంతో పాటు, అన్ని సదుపాయాలతో సిద్ధంగా ఉన్నామని జగన్ స్పష్టం చేశారు.

జిల్లా కేంద్రాల్లో  క్వారంటైన్‌ సదుపాయంతో పాటు, విదేశాల నుంచి తిరిగొచ్చే వారి కోసం తగిన వసతి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు. అందువల్ల కువైట్‌తో పాటు  ఆగ్నేయాసియా దేశాల్లో ఉన్న వలస కార్మికులను వీలైనంత త్వరగా దశలవారీగా రాష్ట్రానికి అనుమతించాలని ముఖ్యమంత్రి జగన్ కోరారు. 

click me!