చంద్రబాబే ప్రధాన ముద్దాయి: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంపై అసెంబ్లీలో జగన్

By narsimha lodeFirst Published Mar 20, 2023, 4:58 PM IST
Highlights

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్  కేసులో  చంద్రబాబు పై  ఏపీ సీఎం వైఎస్ జగన్  ఆరోపణలు  చేశారు.  ఈ స్కాంకు  ప్రధాన సూత్రధారి చంద్రబాబు అని జగన్  చెప్పారు.  

 గుంటూరు: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్  స్కాంలో   ప్రధాన ముద్దాయి  చంద్రబాబు అని  ఏపీ సీఎం వైఎస్ జగన్  చెప్పారు.సోమవారంనాడు ఏపీ అసెంబ్లీలో  ఏపీ స్కిల్ డెవలప్ మెంట్  స్కాంపై  ఏపీ సీఎం జగన్  ప్రసంగించారు.  ఇలాంటి  గొప్ప స్కాం నడిపిన  వ్యక్తి చంద్రబాబు అని  సీఎం జగన్  చెప్పారు. స్కిల్ స్కాంలో  చంద్రబాబు పాత్రపై ఆధారాలు  చూపిస్తామని  ఏపీ సీఎం జగన్  స్పష్టం  చేశారు. ఇంత  పెద్ద  స్కాం జరిగితే  దత్తపుత్రుడు  మౌనంగా  ఉన్నాడని  సీఎం జగన్  పవన్ కళ్యాణ్ పై  విమర్శలు  గుప్పించారు.  చంద్రబాబు  డైరెక్షన్ లేకుండా  ఇంత పెద్ద ఒప్పందాలు  జరుగుతాయా  అని  సీఎం జగన్ ప్రశ్నించారు. ప్రభుత్వం  నుండి షెల్ కంపెనీలకు  వెళ్లిన డబ్బు  చంద్రబాబు ఖాతాల్లోకి వెళ్లిందని  సీఎం జగన్ ఆరోపించారు.  చంద్రబాబు  అకౌంట్ కు  చేరగానే రెండో విడత  నిధులు  రిలీజ్  చేశారని ఆయన  విమర్శించారు.

ఈ స్కాంపై  సీమెన్స్ సంస్థ  కూడా అంతర్గతంగా  విచారణ జరిపించిన విషయాన్ని సీఎం జగన్  గుర్తు  చేశారు.  ఈ తరహా స్కీంలు  తమ సంస్థలో  లేవని సీమెన్స్ సంస్థ స్పష్టత ఇచ్చిందని సీఎం జగన్  చెప్పారు. ప్రభుత్వ జీవోతో తమకు సంబంధం లేదని  సీమెన్స్  కూడా చెప్పిందని  జగన్  గుర్తు  చేశారు.  తమకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుండి  రాలేదని సీమెన్స్  చెబుతుందన్నారు.  ఈ కేసు వెలుగులోకి  రాగానే  స్కిల్ స్కాంకు  సంబంధించిన  ఫైల్ ను మాయం  చేశారని  సీఎం జగన్  ఆరోపించారు. ఈ స్కాంతో  సంబంధం ఉన్న  రెండు సంస్థలు  సర్వీస్ ట్యాక్స్  కట్టలేదని  సీఎం  జగన్  తెలిపారు.  

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్  లో  స్కాం జరుగుతుందని  ఓ వ్యక్తి  2018లోనే  ఏసీబీకి  రాతపూర్వకంగా  ఫిర్యాదు  చేశారని  సీఎం జగన్  ఈ సందర్భంగా  ప్రస్తావించారు.  జీఎస్టీ  అధికారులకు  వచ్చిన అనుమానంతో  ఈ కేసుపై కూపీ లాగారని  సీఎం జగన్  చెప్పారు.  టీడీపీ హయంలోనే  స్కాం  బయటపడినా చంద్రబాబు స్పందించలేదని ఆయన  విమర్శించారు. .  ఇన్ని ఆధారాలు, సాక్ష్యాలు  బయటపడుతున్నా  కక్షసాధింపు  అంటున్నారని  జగన్  టీడీపీపై మండిపడ్డారు. ఈ కేసులో  నలుగురిని ఈడీ అరెస్ట్  చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ మేరకు ఈడీ  ట్వీట్  కూడా  చేసిందన్నారు.  ఈ మేరకు  ఈ కేసుకు సంబంధించిన  నోట్ ఫైల్ ను , ఈడీ ట్వీట్ ను  సీఎం జగన్  అసెంబ్లీలో  సభ్యులకు  చూపారు.   

also read:చంద్రబాబు దోపీడీ విజన్: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్‌ స్కాంపై అసెంబ్లీలో జగన్

నేరగాళ్లకు ఎప్పుడైనా సరైన సమయంలో  దేవుడు మొట్టికాయలు వేస్తాడని  సీఎం జగన్  విశ్వాసం  వ్యక్తం  చేశారు..  ఇప్పటికే  ప్రజలు  చంద్రబాబుకు  మొట్టికాయలు వేశారన్నారు.  ఇలాంటి గజదొంగల ముఠా ఏ రోజు కూడా  రాజ్యాధికారంలోకి రాకుండా  ఇంకా గట్టిగా  మొట్టికాయలు వేసే  రోజులు అతి దగ్గరలోనే  ఉన్నాయని  సీఎం జగన్  అభిప్రాయపడ్డారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో  చంద్రబాబు, ఎల్లో మీడియా  తప్పుడు ప్రచారం  చేస్తుందని  ఏపీ సీఎం జగన్  విమర్శించారు. ఈ కేసులో  ఏం జరిగిందనే విషయాన్ని  ప్రజలకు  వివరించేందుకు గాను  అసెంబ్లీలో  ఈ విషయాలను  ప్రస్తావించినట్టుగా  సీఎం జగన్  చెప్పారు.
 

click me!