మరోవైపు అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసేలా హై కోర్టుకు వందల కోట్లు జమ చేయడంతోపాటు, అగ్రిగోల్డ్ ఆస్తుల వేలంపై కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐదున్నర గంటలపాటు జరిగిన ఈ భేటీలో సంచలన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పాలి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగులు, రైతులు, మహిళలు, విద్యారంగం ప్రదాన లక్ష్యంగా కీలక నిర్ణయాలకు తీర్మానం తీసుకుంది ఏపీ కేబినెట్.
మరోవైపు అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసేలా హై కోర్టుకు వందల కోట్లు జమ చేయడంతోపాటు, అగ్రిగోల్డ్ ఆస్తుల వేలంపై కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐదున్నర గంటలపాటు జరిగిన ఈ భేటీలో సంచలన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పాలి.
ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు
1. మంత్రులెవరైనా అవినీతికి పాల్పడితే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తానని ముఖ్యమంత్రి వైయస్ జగన్ హెచ్చరించారు. డబ్బులు ఎక్కడ నుంచైనా వస్తాయి కానీ మంత్రి పదవులు మాత్రం రావని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలని కోరారు.
ప్రభుత్వానికి పార్టీకి చెడ్డపేరు తీసుకువచ్చేలా ఎవరు వ్యవహరించినా చర్యలు తీసుకుంటాం. రెండున్నరేళ్లు మంత్రి పదవి గ్యారంటీ అనుకోవద్దంటూ మంత్రులకు చురకలు అంటించారు వైయస్ జగన్.
2. మానవీయ కోణంలో ఆలోచించి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయం. ఆర్థిక, రవాణా మంత్రుల సార్థ్యంలో కమిటీ. విలీనంపై నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోనున్నారు.
3. జనవరి 26 నుంచి అమలులోకి రానున్న అమ్మ ఒడి కార్యక్రమం. అదే రోజున పిల్లల్ని చదివించే ప్రతి తల్లికీ రూ.15వేలు చెక్కుల్ని అందించాలని నిర్ణయం.
4. గిరిజన ప్రాంతాల్లోని కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు వేతనం రూ.4వేలకు పెంపు
5. గ్రామ వాలంటీర్లను పార్టీలకతీతంగా పారదర్శకంగా ఎంపిక. పట్టణాల్లో వాటికి ఉత్తీర్ణత డిగ్రీ, గ్రామాల్లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత, గిరిజన ప్రాంతాల్లో పదో తరగతి ఉత్తీర్ణతగా నిర్ణయం. ఆగస్టు 15 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయం. గ్రామ సచివాలయానికీ అవసరమైన ఉద్యోగాల నియామకం చేపట్టాలని నిర్ణయం
6. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై గత ప్రభుత్వం ఏర్పాటుచేసిన అన్ని కమిటీలను రద్దు
7. టీటీడీ పాలకమండలిని రద్దు చేసేందుకు చర్యలు
8. అక్టోబర్ 15 నుంచి అమలులోకి రానున్న రైతుభరోసా పథకం. ఈ పథకం కింద రైతులకు రూ.12,500 చొప్పున లబ్ధి. రాష్ట్రంలో సుమారు 50 లక్షలకు పైగా రైతులకు ప్రయోజనం.
9. సీఎం జగన్ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు కమిషన్ ఏర్పాటు. సీఎంతోపాటు ఆరు లేదా ఏడుగురు సభ్యులు. రైతు సంఘం నాయకులు, నిపుణులు సభ్యులతో కమిటీ. వ్యవసాయంలో పురోగతి, రైతు సంక్షేమం, ధరల స్థిరీకరణను పర్యవేక్షణ.
10. వైయస్ఆర్ భరోసా పేరుతో వడ్డీలేని రుణాలు
11. పంట రుణాలు తీసుకున్న ప్రతి రైతుకూ వడ్డీ చెల్లించే అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే బ్యాంకులతో ఒప్పందం చేసుకుని ఆ వడ్డీలను బ్యాంకులకు చెల్లిస్తుంది. వడ్డీ రశీదును గ్రామ వాలంటీర్ల ద్వారా రైతులకు అందజేయాలని నిర్ణయం
12. 2014 నుంచి 2019 వరకు రైతులకు చెల్లించకుండా ఉంచిన రూ.2వేల కోట్ల ఇన్పుట్ సబ్సిడీ బకాయిలను తక్షణమే చెల్లింపు.
13. ప్రకృతి వైపరీత్యాల సహాయనిధి కింద రూ.2వేల కోట్లతో నిధి ఏర్పాటు
14. రూ.3వేల కోట్లతో మార్కెట్ ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు
15. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఉచిత బోర్ల ఏర్పాటు. పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి, అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున రిగ్గులను అందుబాటులో ఉంచి ప్రాధాన్యతల వారీగా ఉచితంగా బోర్లు వేయించాలని నిర్ణయం.
16. పండించిన పంటకు కనీస మద్దతు ధర రాని చోట్ల ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయం
17. పంటలకు క్రాప్ ఇన్సూరెన్స్ ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయం. పంట నష్టం జరిగి క్లెయిమ్ను రైతుకు అందజేసే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంటుంది.
18. మహిళలకు ఉగాది కానుక. గ్రామాల్లో అర్హత కలిగి ఇంటి స్థలం లేక ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి ఇళ్ల స్థలాలు ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆ ఇంటి ఇల్లాలి పేరుపై రిజిస్ట్రేషన్ చేసి ఉగాది రోజున పట్టాలు ఇవ్వాలని నిర్ణయం. రెండో ఏడాది నుంచి పక్కా ఇళ్ల నిర్మాణ కార్యక్రమం.. పాతిక లక్షలఇళ్లు నిర్మించాలని నిర్ణయం.
19. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో జ్యుడీషియల్ కమిటీ ఏర్పాటు
20. సహకార రంగంలో ఉన్న చక్కెర కర్మాగారాలను పునరుద్ధరించాలని కేబినెట్ నిర్ణయం. మూతపడిన చక్కెర కర్మాగారాలను తెరిపించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ.
21. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జులై 1 నుంచి 27శాతం మధ్యంతర భృతి అమలు చేయాలని నిర్ణయం. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.815 కోట్ల అదనపు భారం పడనుంది. ఈ నిర్ణయంతో నాలుగు లక్షలకు పైగా ఉద్యోగులకు లబ్ధి
22. సీపీఎస్ రద్దు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయం. ఆర్థిక మంత్రి ఛైర్మన్గా కార్యాచరణ కమిటీ ఏర్పాటు
23. అర్హత, అనుభవం ఆధారంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు కేబినెట్ నిర్ణయం. దీనిపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం
24. అన్ని విభాగాల్లోని కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులకు రూ.18వేల వేతనం ఇవ్వాలని నిర్ణయం. దీని అమలుకు 'కమిటీ ఆఫ్ సెక్రటరీస్' ఏర్పాటు
25. మెప్మా, సెర్ప్లో డ్వాక్రా మహిళా సంఘాలకు సేవలందిస్తున్న ఉద్యోగులకు రూ.10వేల గౌరవవేతనం అందివ్వాలని నిర్ణయం
26. అంగన్వాడీ వర్కర్లు, ఆయాలకు వేతనం పెంపు. అంగన్వాడీ వర్కర్ల వేతనం 11,500కు పెంపు
27 రేషన్ దుకాణాల ద్వారా నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేయాలని నిర్ణయం. మరో ఐదు లేక ఆరు నిత్యావసర సరకులు పంపిణీ.. సెప్టెంబర్ 5 నుంచి అమలు. గ్రామవాలంటీర్ల ద్వారా ఇంటింటికీ నిత్యావసరాల పంపిణీకి నిర్ణయం.
28. ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని నిర్ణయం. ప్రస్తుతం ఉన్న పాఠశాల యథాస్థితిని ఫొటోలు తీసి, వాటిని మరమ్మతులు చేయించి తర్వాత మళ్లీ ఫొటోలు తీసి ఎలా మారిందనేది చెప్పనున్నారు.
29. మధ్యాహ్న భోజనం కార్మికుల వేతనాలను రూ.3వేలకు పెంపు