చంద్రబాబుపై ఢిల్లీలో జోకులు: బట్టబయలు చేసిన బీజేపీ నేతలు

By Nagaraju TFirst Published Jan 19, 2019, 2:58 PM IST
Highlights

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఏపీ బీజేపీ నేతలు నిప్పులు చెరిగారు. ఏపీ అభివృద్ధి చెందకపోవడానికి ప్రధాన అడ్డంకి చంద్రబాబు నాయుడేనని ఆరోపించారు. కడప జిల్లాలో కందుల ఎస్టేట్‌లో రాయలసీమస్థాయి శక్తికేంద్రాల ప్రముఖ్‌లతో నిర్వహించిన సమావేశంలో బీజేపీ నేతలు విరుచుకుపడ్డారు. 
 


కడప: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఏపీ బీజేపీ నేతలు నిప్పులు చెరిగారు. ఏపీ అభివృద్ధి చెందకపోవడానికి ప్రధాన అడ్డంకి చంద్రబాబు నాయుడేనని ఆరోపించారు. కడప జిల్లాలో కందుల ఎస్టేట్‌లో రాయలసీమస్థాయి శక్తికేంద్రాల ప్రముఖ్‌లతో నిర్వహించిన సమావేశంలో బీజేపీ నేతలు విరుచుకుపడ్డారు. 

ఏపీ అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ కట్టుబడి ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. రాష్ట్రం విభజన అనంతరం ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులు ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఇచ్చిందన్నారు. కేంద్రం చేసిన సహాయాన్ని నిర్భయంగా చెప్పే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. 

అనంతపురం జిల్లాలో కియా మోటార్స్‌ పరిశ్రమ వచ్చిం దంటే అది ప్రధాని మోదీ చలవేనని ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు. రాయలసీమ జిల్లాల్లో సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తికి కూడా చొరవ తీసుకుంది తమ ప్రభుత్వమేనన్నారు. ప్రాజెక్టులకు కోట్లరూపాయలు ఇచ్చి పూర్తిచేయమని కేంద్రం చెబితే ఆ నిధులను తన అనుయాయులైన కాంట్రాక్టర్‌లకు ఇచ్చుకుని కమీషన్‌ నొక్కేశారని ఆరోపించారు. 

నీరు –చెట్టు పథకం పేరుతో చెరువులను చెరపట్టి దోపిడీకి తెరతీశారని మండిపడ్డారు. వైఎస్‌ఆర్‌ జిల్లా కేంద్రమైన కడప నుంచి ఎన్నికల శంఖారావం పూరిస్తున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రజలు నిజాయితీ పరిపాలన అందించాలని అధికారమిస్తే చంద్రబాబు ఆ అధికారాన్ని స్వప్రయోజనాలకు వాడుకున్నారంటూ విరుచుకుపడ్డారు. 

2014న సీఎంగా ప్రమాణ స్వీకారం రోజున కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి పీయూస్‌ గోయల్‌ ఈ రాష్ట్రానికి 24 గంటలు కరెంటు ఇస్తున్నట్లు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్రం 24 గంటలు విద్యుత్ ఇస్తుంటే దాన్ని కూడా చంద్రబాబు తన ఖాతాలో వేసుకోవడం దారుణమన్నారు. 

రాయలసీమ వెనుకబాటు తనానికి చంద్రబాబు వైఖరే కారణమని ఆరోపించారు. రూ.75 వేల కోట్ల విలువ చేసే మట్టిని అమ్ముకుని టీడీపీ నాయకులు సొమ్ము చేసుకున్నారంటూ ధ్వజమెత్తారు. కడప ఉక్కుఫ్యాక్టరీ ఏర్పాటుకోసం వనరులకు సంబంధించి సమాచారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం కోరితే  అందుకు ఎలాంటి సహకారం, సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. 

మరోవైపు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం రైతులను, డ్వాక్రా మహిళలను, నిరుద్యోగ యువతను మోసం చేసిందని అఖిల భారత మహిళా మోర్చా ఇన్‌చార్జి దగ్గుబాటి పురంధేశ్వరి  ఆరోపించారు. ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందన్నారు.

బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పడే పరిస్థితి లేదని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ చెప్పుకొచ్చారు. ఉత్తరప్రదేశలో అఖిలేష్, మాయావతి ఇప్పటికే కూటమి నాయకుడిగా చెప్పుకుంటున్న సీఎం చంద్రబాబును ముందు మీ పీఠం గురించి ఆలోచించి రమ్మనట్లు ఢిల్లీలో చెప్పుకుంటున్నారని గుర్తు చేశారు. 

చంద్రబాబు పీఠంపై ఢిల్లీలో జోకులు వేసుకుంటున్నారని విమర్శించారు. తొమ్మిది సంవత్సరాల్లో హైదరబాద్‌ను తానే కట్టానని చెప్తున్న చంద్రబాబు మరి ఐదేళ్లలో రాజధానిని ఎందుకు నిర్మించలేకపోయారోనని ప్రశ్నించారు. దేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వాల్లో ఏపీలోని టీడీపీ సర్కార్‌ నాలుగో స్థానంలో ఉందని సాక్షాత్తు ఢిల్లీలోని సీడీఎఫ్‌ నివేదిక ఇచ్చిందన్నారు.  

click me!
Last Updated Jan 19, 2019, 3:08 PM IST
click me!