
కోనసీమ జిల్లాకు (konaseema district) అంబేద్కర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ అమలాపురంలో (amalapuram violence) జరిగిన విధ్వంసంపై ప్రభుత్వం విశ్రాంత జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు బీజేపీ (bjp) ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు (somu veerraju) . బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెడితే ఎందుకు గొడవలు జరుగుతున్నాయని ప్రశ్నించారు. కొందరు స్వార్థప్రయోజనాలతో అల్లర్లు సృష్టించి లబ్ధిపొందాలని చూస్తున్నాయని వీర్రాజు ఆరోపించారు. బీజేపీ దేశవ్యాప్తంగా 42 చోట్ల అంబేద్కర్ పేరు పెట్టినా గొడవలు రాలేదని ఆయన గుర్తుచేశారు.
ఓట్ల కోసం చేస్తున్న రాజకీయంలో భాగంగానే కోనసీమలో గొడవలు జరుగుతున్నాయని సోము వీర్రాజు విమర్శించారు. కొన్ని వర్గాలను కావాలనే రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. మంత్రి, ఎమ్మెల్యేల ఇల్లు తగలబెడితే హోంమంత్రి , డీజీపీ వెళ్లి పరిశీలించరా అని సోము వీర్రాజు నిలదీశారు. కోనసీమ ఘటనపై ప్రభుత్వం నివేదిక తెప్పించుకోదా అని ప్రశ్నించారు. గోదావరి గర్జన (godavari garjana) పేరుతో రాజమహేంద్రవరంలో ఈనెల 7న భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని, ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా (jp nadda) హాజరవుతున్నారని సోము వీర్రాజు వెల్లడించారు.
Also Read:కొనసీమలోని మూడు మండలాలకు ఇంటర్ నెట్ పునరుద్ధరణ.. ఇప్పటివరకు 71 మంది అరెస్ట్..
మరోవైపు.. అల్లర్ల నేపథ్యంలో కొనసీమ జిల్లాలో ఇంటర్ నెట్ సేవలను గత వారం రోజులుగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీంతో వర్క్ ఫ్రమ్ చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు, పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, బ్యాంకింగ్ సేవలపై ఆధారపడిన వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డిజిటిల్ లావాదేవీలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. గ్రామ సచివాలయాల్లో కూడా డిజిటల్ ఆధారిత పనులు నిలిచిపోయాయి.
ఈ క్రమంలోనే పలువురు ఇంటర్ నెట్ వినియోగించుకోవడానికి గోదావరి తీరానికి క్యూ కడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వైపు లంకలు దాటుతున్నారు. మొబైల్స్ సిగ్నల్స్ అందుతున్న చోటుకు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. కొందరు తాళ్లరేవు, కాకినాడ, రాజమహేంద్రవరం, యానాం తదితర ప్రాంతాలకు వెళ్లి ఇంటర్నెట్ సేవలను వినియోగించుకుంటున్నారు. ఇందుకోసం లాడ్జీలు, తాత్కాలిక షెల్టర్లలో మకాం వేశారు. వీరంతా కోనసీమలో ఇంటర్ నెట్ సేవలను పునరుద్దరించాలని కోరుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా కోనసీమలో ఇంటర్ నెట్ సేవలు పునరుద్ధరించలేకపోవడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనం అని విమర్శలు చేశారు.
అయితే సోషల్ మీడియాలో పుకార్ల నియంత్రణ కోసమే ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్టుగా అధికారులు చెబుతున్నారు. ఇంటర్నెట్ సేవలను మరో 24 గంటలు పొడిగించినట్లు కోనసీమ జిల్లా ఎస్పీ కేఎస్ఎస్వీ సుబ్బారెడ్డి తెలిపారు. అయితే కొనసీమ జిల్లాలోని మొత్తం 16 మండలాల్లో.. 3 మండలాలకు మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు. సఖినేటిపల్లి, మలికిపురం, ఐ.పోలవరం మండలాల్లో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించినున్నట్టుగా వెల్లడించారు. మిగిలిన మండలాల్లో బుధవారం కూడా ఇంటర్నెట్ ఉండదన్నారు. ఇక, ఇంటర్ నెట్ సేవలు నిలిచిపోయిన నేపథ్యంలో వాలంటీర్లు బయోమెట్రిక్ లేకుండానే.. రేషన్, పించన్ పంపిణీ చేపడుతున్నారు.