ఏపీ అసెంబ్లీలో గందరగోళం.. శాసనసభ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్..

By Sumanth KanukulaFirst Published Mar 18, 2023, 10:24 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి తెలుగుదేశం పార్టీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. 11 మంది టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఒక్క రోజు పాటు సస్పెండ్ చేశారు. 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి తెలుగుదేశం పార్టీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. 11 మంది టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఒక్క రోజు పాటు సస్పెండ్ చేశారు. వివరాలు.. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వివరాలు బహిర్గతం చేయాలని టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. దీనిపై చర్చకు పట్టుబట్టిన టీడీపీ సభ్యులు సభలో నిరసనకు దిగారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలోనే టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని మంత్రి బుగ్గన ప్రతిపాదించారు. 

దీంతో 11 మంది టీడీపీ సభ్యులపై ఒక రోజు సస్పెన్షన్ వేటు పడింది. సభలో నుంచి సస్పెండ్ అయినవారిలో అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవానీ, నిమ్మకాయల చినరాజప్ప, బెందాళం అశోక్, గణబాబు, వెలగపూడి రామకృష్ణ, మంతెన రామరాజు, సాంబశివరావు, గద్దె రామ్మెహన్, డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రమికుమార్‌లు ఉన్నారు. 

ఇక, ఈరోజు ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే.. శాసనసభలో స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అయితే టీడీపీ సభ్యులు.. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి ఏం సాధించారని ప్రశ్నిస్తూ నిరసన కొనసాగించారు. 

అయితే టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. సీఎం ఢిల్లీ పర్యటనపై వాయిదా తీర్మానం ఇవ్వడం  ఏమిటని ప్రశ్నించారు. వాయిదా తీర్మానానికి అర్థం తెలుసా? అని మండిపడ్డారు. టీడీపీ హయాంలో ఏం జరిగిందో అందరికి తెలుసునని అన్నారు. సీఎం ఢిల్లీ పర్యటనల  గురించి చర్చించాలంటే.. గతంలో 30 సార్లు చంద్రబాబు ఢిల్లీ  వెళ్లారని అవి చర్చకు పెడదామా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించిన అంశాల గురించి చర్చించడం జరిగిందని తెలిపారు. 

పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారంతో పాటు పోలవరం ప్రాజెక్టు నిధులపై ప్రధాని మోదీతో సీఎం జగన్ చర్చించారని అన్నారు. టీడీపీ హయాంలో చేసిన అప్పులు, పోలవరంలో జరిగిన  తప్పులపై చర్చిద్దామా అని ప్రశ్నించారు. టీడీపీ సభ్యులకు రోజూ ఇదో అలవాటుగా మారిందని విమర్శించారు. టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడే బీఏసీ సమావేశంలో ఆదివారం సభ పెట్టమని అడిగారని చెప్పారు. 
 

click me!