15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.గవర్నర్ ప్రసంగం తర్వాత ఉభయ సభలు వాయిదా పడ్డాయి.
అమరావతి: 15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.గవర్నర్ ప్రసంగం తర్వాత ఉభయ సభలు వాయిదా పడ్డాయి.
సభ వాయిదా పడిన తర్వాత బీఎసీ సమావేశం ప్రారంభమైంది. స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి సీఎం వైఎస్ జగన్ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కన్నబాబు, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు.ఇక టీడీపీ తరపున టీడీఎల్పీ ఉప నాయకుడు నిమ్మల రామానాయుడు హాజరయ్యారు.
బీఏసీ సమావేశంలో టీడీపీ తరపున 16 అంశాలను ఎజెండాలో పెట్టాలని టీడీపీ పట్టుబట్టింది. టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడి అరెస్ట్తో పాటు పలు అంశాలను టీడీపీ బీఏసీ సమావేశంలో ప్రస్తావించింది.
కరోనా కట్టడిలో ప్రభుత్వ వైఫల్యం, అమరావతి రాజధాని అంశం, ఏపీకి ప్రత్యేక హోదా, విద్యుత్ ఛార్జీల పెంపు, బలవంతపు భూసేకరణ, భూ కొనుగోళ్లలో అక్రమాలు.
ఇసుక అక్రమ రవాణా,మద్యం ధరల పెరుగుదల,దళితులపై దాడులు, ప్రభుత్వ భూముల విక్రయంపై చర్చించాలని టీడీపీ డిమాండ్ చేసింది. అంతేకాదు ఈ సమావేశాలను కనీసం 15 రోజుల పాటు నిర్వహించాలని టీడీపీ పట్టుబట్టింది.
అసెంబ్లీ సమావేశాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ ప్రారంభించారు. కనీసం వీడియో కాన్ఫరెన్స్ ద్వారానైనా 15 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని టీడీపీ కోరినట్టుగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే శాసనమండలి బీఏసీ సమావేశం ఛైర్మెన్ షరీఫ్ అధ్యక్షతన ప్రారంభమైంది. ఈ సమావేశంలో మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, టీడీపీ తరపున యనమల రామకృష్ణుడు హాజరయ్యారు.