ఆనందయ్య కరోనా మందు: ఇప్పటికే ఆసుపత్రిలో కోటయ్య.. మరో యువతికి కంటి ఇన్పెక్షన్

By Siva KodatiFirst Published May 22, 2021, 8:35 PM IST
Highlights

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య తయారు చేసిన మందు వేసుకుని ఓ యువతి ఆసుపత్రిలో చేరింది. నిన్నటి నుంచి ఆయుష్ బృందం నెల్లూరులోనే వుంది. రేపు సాయంత్రానికి ఐసీఎంఆర్ బృందం నెల్లూరుకు చేరుకోనుంది.

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య తయారు చేసిన మందు వేసుకుని ఓ యువతి ఆసుపత్రిలో చేరింది. నిన్నటి నుంచి ఆయుష్ బృందం నెల్లూరులోనే వుంది. రేపు సాయంత్రానికి ఐసీఎంఆర్ బృందం నెల్లూరుకు చేరుకోనుంది. సోమవారం నాడు రెండు బృందాల సమక్షంలో ఆనందయ్య మందు తయారు చేయనున్నారు.

అనంతరం అధికారులు శాంపిల్స్‌ను ల్యాబ్‌కు తీసుకెళ్తారు. ఈ రెండు బృందాల నివేదిక ఆధారంగా ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీపై నిర్ణయం తీసుకోనుంది ఏపీ సర్కార్. మరోవైపు శుక్రవారం మధ్యాహ్నం నుంచి అధికారుల ఆధీనంలోనే వున్నారు ఆనందయ్య.

ఆనందయ్య మందు తయారీని నిన్నటి నుంచి నిలిపివేశారు అధికారులు. అలాగే ఆనందయ్య మందు తయారీకి వాడే పాత్రలను కూడా నెల్లూరు తరలించారు. మందు తయారీ నిలిపివేసినప్పటికీ శనివారం కూడా భారీగా కరోనా రోగులు కృష్ణపట్నం వచ్చారు. సీరియస్‌గా వున్న కొంతమందికి కంటిలో డ్రాప్స్ వేశారు ఆనందయ్య అనుచరులు. 

Also Read:అధికారుల ఆధీనంలోనే ఆనందయ్య: మందుకోసం జనం బారులు, రేపు కృష్ణపట్నానికి ఐసీఎంఆర్ బృందం

మరోవైపు రెండ్రోజుల క్రితం కంటిలో డ్రాప్స్ వేసుకున్న తర్వాత హుషారుగా కనిపించారు కోటయ్య. అయితే ఇవాళ ఉదయం ఒక్కసారిగా పల్స్ పడిపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆయనను నెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కోటయ్యకు టాక్సిక్ కైరటైటిస్ అనే కంటి ఇన్ఫెక్షన్ సోకినట్లుగా వైద్యులు గుర్తించారు.  

మరోవైపు, బొనిగె ఆనందయ్య ఇస్తున్న కరోనా మందుపై ఆయుష్ కమిషనర్ రాములు శుభవార్త చెప్పారు. మందు తయారీలో వాడే పదార్థాలన్నీ శాస్త్రీయంగానే ఉన్నాయని, మందు తయారీ పదార్థాలపై ల్యాబ్ నుంచి పాజిటివ్ నివేదిక వచ్చిందని ఆయన చెప్పారు. ఆనందయ్య మందు ఎలా తయారు చేస్తున్నారో పరిశీలిస్తామని రాములు చెప్పారు. ఆనందయ్య కరోనా మందుపై రాములు ఆధ్వర్యంలోనే అధ్యయనం జరుగుతోంది.

click me!