సంచలనం సృష్టించిన శ్రీగౌతమి హత్య కేసులో పోలీసులు మరో నిందితుడిని గుర్తించారు. శ్రీగౌతమి, ఆమె చెల్లెలు ప్రయాణిస్తున్న టూవీలర్ ను నిందితులకు చూపెట్టి, వాటి ఫొటోలను చేరవేసిన డ్రైవర్ ను పోలీసులు పట్టుకున్నారు.
ఏలూరు: సంచలనం సృష్టించిన శ్రీగౌతమి హత్య కేసులో మరో విషయం వెలుగు చూసింది. ఈ కేసులో పోలీసులు మరింత ప్రగతి సాధించారు. కీలక నిందితుల్లో ఒకడైన డ్రైవర్ లక్ష్మణ రావును పాలకొల్లు రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హత్య జరిగిన రోజు హంతకులతో పాటు అతను ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. శ్రీ గౌతమి, పావనిలు నడిపే టూవీలర్ను అతను హంతకులకు చూపి, ఫొటోలను అందించినట్లు పోలీసులు తెలిపారు. గత నెల 26న కూడా నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో ఏడుగురు నిందితులకు సంబంధం ఉన్నట్లు తొలుత ప్రాధమికంగా భావించారు. అయితే తాజాగా లక్ష్మణ రావుతో కలపి మొత్తం ఎనిమిది మందిని నిందితులుగా పోలీసులు గుర్తించారు. వీరిలో ప్రస్తుతం బెయిల్పై బయట తిరుగుతున్న నిందితులు సందీప్, దుర్గాప్రసాద్లు టాటా సఫారీతో టూవీలర్ ను ఢీకొట్టి శ్రీగౌతమిని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
దాంతో వారిద్దరి బెయిల్ రద్దు చేసి అరెస్ట్కు అవకాశం ఇవ్వాలని పాలకొల్లు పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. గతంలో రోడ్డు ప్రమాదంగా చూపి ఈ ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. సీఐడీ దర్యాప్తుతో గౌతమి హత్యకేసు వెలుగులోకి రావడవంతో కేసు తిరిగి తెరిచి దర్యాప్తు ప్రారంభించారు. 302, 307 సెక్షన్లుగా కేసు మార్పు చేశారు.