
GVL Narasimha Rao: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే నూతనంగా ఏర్పడిన పల్నాడు జిల్లాపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. కొత్తగా ఏర్పడిన పల్నాడు జిల్లాకు పలు కేంద్ర సంస్థలు తీసుకురావడానికి కృషి చేస్తానని చెప్పారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం నుంచి సకాలంలోనే నిధులు వస్తున్నాయని పేర్కొన్న ఆయన.. వీటిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ వైకాపా ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవడం లేదని ఆరోపించారు. నరసరావు పేటలో జీవీఎల్.. శనివారం నాడు మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.
నూతనంగా ఏర్పడిన పల్నాడు జిల్లాను జీవీఎల్ నరసింహరావు శనివారం సందర్శించారు. పల్నాడు జిల్లా కలెక్టర్ శివ శంకర్ ను కలిసి పలు విషయాల గురించి మాట్లాడారు. పల్నాడు జిల్లా ఏర్పాటు తర్వాత జిల్లా అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని జిల్లా యంత్రాంగానికి తెలిపారు. కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు, నకరికల్ నుంచి నరసరావుపేట వరకు రైల్వే ట్రాక్ ఏర్పాటు, అంతేకాకుండా పల్నాడు ప్రాశస్త్యాన్ని తెలిపే విధంగా పర్యాటక అభివృద్ధి, పల్నాడు చరిత్రను తెలిపే విధంగా తీసుకోవాల్సిన చర్యలు గురించి చర్చించి చర్చించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పలు పథకాలతో పాటు , కేంద్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటుకు తన సహాయ సహకారాలు అందిస్తానని జీవీఎల్ నరసింహరావు వెల్లడించారు.
కాగా, జీవీఎల్ నరహింహరావు అంతకు ముందు రోజు రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన క్యాబినెట్ పై స్పందిస్తూ.. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్లో పునర్నిర్మించిన మంత్రివర్గంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ.. మంత్రులెవరికీ నిజమైన అధికారాలు లేవని ఆరోపించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న అనంతరం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత క్యాబినెట్ లో హోంమంత్రిని ఇంటికి పంపారని, ఇప్పుడు కూడా అదే కొనసాగిస్తున్నారని అన్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు అండగా ఉంటానని చెప్పుకునే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆ వర్గాల నుంచి ఎవరినైనా ముఖ్యమంత్రిని చేయాలంటూ హితవు పలికారు.
ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను అమాయకులుగా అభివర్ణించిన జీవీఎల్ నరసింహరావు.. వారి పేర్లు కూడా ప్రజలకు తెలియవని అన్నారు. అధికార వైఎస్సార్సీపీ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలకు స్వస్తి పలకాలని సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న విద్యుత్ సంక్షోభానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసమర్థతే కారణమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. “పెట్రోలు, డీజిల్ ధరలు దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఉన్నాయి. నిత్యావసరాల ధరలు ఇలాగే పెరిగిపోతే, భవిష్యత్తులో అధికార వైఎస్సార్సీపీ, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని జీవీఎల్ హెచ్చరించారు.