రాష్ట్రంలో అభివృద్ది ఆగిపోయినట్టుగా అనిపిస్తుంది.. రాజధాని కేసుల విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

By team teluguFirst Published Nov 15, 2021, 12:34 PM IST
Highlights

సీఆర్‌డీఏ (CRDA రద్దు, పాలన వికేంద్రీకరణను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా (Justice prashant kumar mishra) నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణను మొదలు పెట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో (Andhra Pradesh High Court) రాజధాని కేసుల రోజువారి విచారణ నేడు ప్రారంభమైంది. సీఆర్‌డీఏ (CRDA రద్దు, పాలన వికేంద్రీకరణను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా (Justice prashant kumar mishra) నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణను మొదలు పెట్టింది. ఈ సందర్బంగా హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాజధాని కేసులను విచారిస్తున్న త్రిసభ్య ధర్మాసనం నుంచి ఇద్దరు న్యాయమూర్తులు  సత్యనారాయణ మూర్తి, సోమయాజులను తప్పించాలని ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. 

అయితే గతంలో ఇవే పిటిషన్లపై విచారణ చేపడుతున్నప్పుడు ఎందుకు అభ్యంతరం తెలుపలేదని హైకోర్టు ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. న్యాయమూర్తుల విషయంలో అభ్యంతరం తెలుపుతూ ప్రభుత్వ న్యాయవాది చేసిన వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. ఇదిలా ఉంటే పిటిషన్లు దాఖలు చేసిన రైతుల తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ లాయర్ శ్యామ్‌దివాస్‌ వాదనలు వినిపిస్తున్నారు. ఈ సందర్భంగా రాజధాని కేసుల విచారణకు ప్రాముఖ్యం ఉందని ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేసులు పెండింగ్‌లో ఉండటం వల్ల  రాష్ట్రంలో అభివృద్ధి అంతా నిలిచిపోయినట్లు అనిపిస్తోందని అభిప్రాయం వ్యక్తం చేసింది. 

రాజధాని కేసులు పెండింగ్‌లో ఉండటం వల్ల రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా వ్యాఖ్యానించారు. రాజధాని కేసులను త్వరగా విచారిస్తామని తెలిపారు. 

click me!