
ఆంధ్రప్రదేశ్ లో వాహనదారులకు ప్రభుత్వం కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. 2021 ఏప్రిల్ 1 నుంచి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కోసం చెల్లుబాటయ్యే ఫాస్టాగ్ ను తప్పనిసరి చేసింది. దీని కోసం రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. డిసెంబర్ నాటికి అన్ని వాహనాలకు ఫాస్టాగ్ స్టిక్కర్లు అంటించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఫాస్టాగ్ లేని వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికేట్ జారీ చేయవద్దని రవాణా శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో నేషనల్ హైవాలేపై 42 చోట్ల టోల్ ప్లాజాలు ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకు 75శాతం ఫాస్టాగ్ లైన్లు, 25శాతం డబ్బు చెల్లించేందుకు లైన్లు ఏర్పాటు చేశారు. ఇకపై మొత్తం ఫాస్టాగ్ లైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
వాహనాలకు వచ్చే జనవరి 1నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి చేస్తూ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. 2019 డిసెంబర్ నుంచి దేశ వ్యాప్తంగా ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ఈటీసీ) విధానం అమలు చేయాలని నిర్ణయించినా సాధ్యపడలేదు. ఆ తర్వాత కోవిడ్ కారణంగా ఈ విధానం అమలు వాయిదా పడింది.
అందుకే జనవరి 1 నుంచి వాహనానికి ఫాస్టాగ్ ఉంటేనే ఫిట్నెస్ సర్టిఫికెట్ రెన్యువల్ చేయాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచనలు చేసింది. కేంద్ర మోటారు వాహన చట్టం–1989ను సవరించడం ద్వారా ప్రతి వాహనానికి ఫాస్టాగ్ ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రస్తుతం వాహనం కొనుగోలు సమయంలోనే డీలర్లు ఫాస్టాగ్ను అందిస్తున్నారు. ఈ మేరకు గతంలోనే ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2017 డిసెంబర్కు ముందు కొనుగోలు చేసిన వాహనాలకు కచ్చితంగా ఫాస్టాగ్ ఉండాలని కేంద్రం నోటిఫికేషన్ జారీ చేయడంతో ఏపీలో కూడా రవాణాశాఖకు ఉత్తర్వులు అందాయి.