వైఎస్ఆర్ వేదాద్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కి సీఎం శంకుస్థాపన

By narsimha lodeFirst Published Aug 28, 2020, 1:19 PM IST
Highlights

వైయస్సార్‌ వేదాద్రి ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌  శుక్రవారం నాడు శంకుస్థాపన చేశారు. వీడియో లింక్‌ ద్వారా  సీఎం శంకుస్థాపన చేశారు.
 


అమరావతి: వైయస్సార్‌ వేదాద్రి ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌  శుక్రవారం నాడు శంకుస్థాపన చేశారు. వీడియో లింక్‌ ద్వారా  సీఎం శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో వేదాద్రి నుంచి మంత్రులు అనిల్‌కుమార్‌యాదవ్, పేర్నినాని, కొడాలినాని, ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, మొండితోక జగన్‌మోహన్‌రావు, కైలే అనిల్‌కుమార్, మహిళా కమిషన్‌  ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే సీఎం జగన్ ప్రసంగించారు. విజయవాడకు అతిసమీపంలోని కృష్ణాజిల్లాలోని నందిగామ, వత్సవాయి, పెనుగంచి ప్రోలు, జగ్గయ్యపేట ప్రాంతాల్లో తాగునీటికి, సాగునీటికి కటకటలాడే పరిస్థితి ఉందన్నారు. 

5 ఏళ్లపాటు అధికారంలో ఉండికూడా ఈ ప్రాజెక్టు చేస్తే మంచి జరుగుతుందని తెలిసినా కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. 
మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 14 నెలల్లోపు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాన చేశామన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

నాగార్జున సాగర్‌ ఎడమ కాల్వనుంచి ఈప్రాంతానికి అందాల్సిన నీరు అందడంలేదు.. దీనికి పరిష్కారంగా ఈ ప్రాజెక్టును చేపట్టామన్నారు. ఈ ప్రాంతంలోని 38,627 ఎకరాలకు నీరు అందిస్తామని సీఎం చెప్పారు.

డీబీఆర్‌ బ్రాంచ్‌ కెనాల్‌ పరిధిలోని 30 గ్రామాలతోపాటు జగ్గయ్యపేట మున్సిపాలిటీకి కూడా వైయస్సార్‌ వేదాద్రి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం ద్వారా నీరు అందిస్తామన్నారు.
దాదాపు 2.7 టీఎంసీల నీటిని ఈ ప్రాంతానికి అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ. 490 కోట్లు ఖర్చు చేస్తున్నట్టుగా చెప్పారు.

click me!