
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ముహుర్తం ఖరారు అయింది. ఏప్రిల్ 11న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రి వర్గ విస్తరణ చేపట్టనున్నారు. ఏప్రిల్ 11 ఉదయం 11.31 గంటలకు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నారు. కొత్త మంత్రుల చేత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఢిల్లీ పర్యటన తర్వాత సీఎం జగన్ ఆయనతో భేటీ కానున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి గవర్నర్కు వివరాలు అందజేయనున్నారు.
ఇక, ఏప్రిల్ 7వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో ప్రస్తతం ఉన్న మంత్రులకు ఇదే చివరి కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో మంత్రివర్గంలో కొనసాగేవారెవరు? తొలగించేది ఎవరిని అనే దానిపై సీఎం జగన్ స్పష్టం చేసే అవకాశం ఉన్నట్టుగా చెబుతున్నారు.
మంత్రివర్గంలో చేయబోయే మార్పుల గురించి సీఎం జగన్ ఓ క్లారిటీకి వచ్చినట్టుగా చెబుతున్నారు. ఈ క్రమంలో మంత్రివర్గంలో ప్రస్తుతం ఉన్నవారిలో ఎవరెవరరూ బెర్త్లు కోల్పోనున్నారు..? కొత్తగా అవకాశం దక్కించుకునేవారు ఎవరనేదానిపై వైసీపీ సర్కిల్స్లో తెగ చర్చ సాగుతుంది. మంత్రివర్గంలో నుంచి ఉద్వాసన తప్పదేమోనని చాలా మంది మంత్రులు టెన్షన్ పడుతున్నట్టుగా చెబుతున్నారు. మరోవైపు చాలా కాలంగా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న నేతలు మాత్రం తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
మంత్రివర్గ పునర్వ్యస్థీకరణలో సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. బీసీలు, ఇతర వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. మంత్రి పదవులు కోల్పోయే ఎమ్మెల్యేలకు కీలకమైన పార్టీ బాద్యతలను జగన్ అప్పగించనున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా మంత్రి వర్గ కూర్పు, ఇతర ఎమ్మెల్యేలకు పార్టీ బాధ్యతలు ఉంటాయని భావించవచ్చు.
కడప జిల్లా నుంచి కోరుట్ల శ్రీనివాసులు, అంజాద్ పాషాల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి సిదిరి అప్పలరాజును మంత్రివర్గంలో కొనసాగించే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మాన కృష్ణదాస్ ను తప్పించి ఆయన సోదరుడు ధర్మాన ప్రసాదరావును మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మంత్రిగా ధర్మాన ప్రసాదరావుకు విశేషమైన అనుభవం ఉంది. గుంటూరు జిల్లా నుంచి అంబటి రాంబాబు, విడుదల రజని, పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అంబటి రాంబాబు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో జగన్ తో మొదటి నుంచి కొనసాగుతున్నారు. టీడీపీని ఎదుర్కోవడంలో అంబటి రాంబాబు కీలకమైన పాత్ర పోషిస్తూ వస్తున్నారు.
చిత్తూరు జిల్లా నుంచి నగరి జిల్లా నుంచి రోజాకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. మొదటి నుంచి వైసీపీలో కొనసాగుతూ వస్తున్నారు. తొలిసారే ఆమె మంత్రి పదవిని ఆశించారు. అయితే, ఆమెకు మంత్రిపదవి దక్కలేదు. దాంతో తీవ్రమైన మనస్తాపానికి గురైన రోజా కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ప్రకాశం జిల్లా నుంచి ఆదిమూలపు సురేష్ ను కొనసాగిస్తారా, సుధాకర్ బాబుకు స్థానం కల్పిస్తారా అనేది వేచి చూడాల్సిందే. నెల్లూరు జిల్లా నుంచి కాకాని గోవర్ధన్ కు జగన్ మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది.
విజయనగరం జిల్లా నుంచి రాజన్న దొర లేదా కళావతి మంత్రివర్గంలో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా అబ్బయ్య చౌదరికి మంత్రివర్గంలో అవకాశం దక్కవచ్చు. తూర్పు గోదావరి జిల్లా నుంచి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణకు అవకాశం దక్కవచ్చు. తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు బెర్త్ ఖరారైనట్లు చెబుతున్నారు. కృష్ణా జిల్లా నుంచి జోగి రమేష్, కొలను పార్థసారథి, కొక్కలగడ్డ రక్షణనిధి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అనంతపురం జిల్లా నుంచి శంకరనారాయణను మంత్రివర్గంలో కొనసాగించాలా, ఉషాశ్రీ చరణ్ కు అవకాశం కల్పించాలా అనే ఆలోచన సాగుతోంది. కర్నూలు జిల్లా నుంచి జయరామ్ కు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అలాగే కాటసాని రాంభూపాల్ రెడ్డి, శిల్ప చక్రపాణి రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా నుంచి గుడివాడ అమర్నాథ్ కు వైఎస్ జగన్ మంత్రివర్గంలో అవకాశం దక్కవచ్చు.
మంత్రివర్గంలో స్థానం కోల్పోయే సీనియర్ ఎమ్మెల్యేలను పార్టీ సమన్వయకర్తలుగా నియమించి, ఎన్నికలను ఎదుర్కునే బలమైన జట్టుగా తయారు చేయాలని వైఎస్ జగన్ భావిస్తున్నారు. క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించడంతో పాటు పార్టీని గెలుపు బాటలో నడిపించే జట్టుగా అది పనిచేస్తుంది.