ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ క్లాస్ పేపర్ లీక్ ఘటన.. 11 మంది అరెస్ట్.. వారిలో టీచర్లు కూడా..

Published : Apr 28, 2022, 10:12 AM ISTUpdated : Apr 28, 2022, 10:29 AM IST
ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ క్లాస్ పేపర్ లీక్ ఘటన..  11 మంది అరెస్ట్.. వారిలో టీచర్లు కూడా..

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. అయితే పరీక్షలు ప్రారంభమైన మొదటి రోజే పేపర్ లీక్ కావడం విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆందోళనకు  గురిచేసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 11 మందిని అరెస్ట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. అయితే పరీక్షలు ప్రారంభమైన మొదటి రోజే పేపర్ లీక్ కావడం విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆందోళనకు  గురిచేసింది. ఈ ఘటన నంద్యాల జిల్లా  కొలిమిగుండ్ల  మండలంలోని అంకిరెడ్డిపల్లె జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి.. 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో టీచర్లతో పాటు సిబ్బంది కూడా ఉన్నారు.  కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ రాజేష్ ప్రశ్నపత్రం ఫొటో తీసి.. దానిని తొమ్మిది మంది టీచర్లకు పంపారు. అయితే పరీక్ష ప్రారంభమైన తర్వాత ఈ ఘటన చోటుచేసుకున్నట్టుగా అధికారులు తెలిపారు. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలను నంద్యాల జిల్లా కలెక్టర్ మనజీర్ జీలానీ సామూన్, ఎస్పీ రఘవీరా రెడ్డి మీడియాకు వెల్లడించారు. పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు నియమించిన విద్యాశాఖకు చెందిన కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ రాజేష్ ప్రశ్నపత్రం యొక్క ఫోటో తీసి తొమ్మిది మంది ఉపాధ్యాయులకు సమాధాన పత్రాలను పొందడానికి పంపారని చెప్పారు. అవకతవకలను గుర్తించడంతో కొలిమిగుండ్ల ఎంఆర్‌ఓ, పోలీసులు, జిల్లా విద్యాశాఖాధికారి విచారణ జరిపి రాజేష్‌తో పాటు పలువురు ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు. 

పరీక్షను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో విఫలమైనందుకు ఇన్విజిలేటర్ వీరేష్, సిట్టింగ్ స్క్వాడ్ రాఘవయ్య, సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్‌ సుధాకర్ గుప్తా, డిపార్ట్‌మెంటల్ అధికారి రామకృష్ణారెడ్డిలను సస్పెండ్ చేసినట్టుగా తెలిపారు. ఇక, కొలిమిగుండ్ల పరీక్ష కేంద్రంలో 193 విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.

ఈ ఘటనపై పాఠశాల విద్యాశాఖ స్పందించింది. ప్రశ్నపత్రం లీకైనట్టుగా సోషల్ మీడియాలో, కొన్ని టీవీ చానళ్లలో జరిగిన ప్రచారం వాస్తవం కాదని పాఠశాల విద్యా శాఖ కమిషనర్ సురేష్ కుమార్ చెప్పారు. ‘‘ఉదయం 11 గంటల సమయంలో ఎవరో ఒక పరీక్షా కేంద్రంలో తీసిన ప్రశ్నపత్రం ఫోటోలను వ్యాప్తి చేయడం ప్రారంభించారని మాకు తెలిసింది. పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైనందున..దానిని లీక్ అని పిలవలేము. ఇది ఎవరో సృష్టించిన వికృత చేష్ట’’ అని సురేశ్ కుమార్ అన్నారు. ఇది మాల్ ప్రాక్టీస్ కిందకు వస్తుందన్నారు. ఈ ఘటన నేపథ్యంలో పరీక్షా కేంద్రాల్లోకి ఎవరూ మొబైల్‌ తీసుకెళ్లకుండా చూడాలని కమిషనర్‌ సురేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా అవకతవకలు జరిగితే చీఫ్‌ సూపరింటెండెంట్‌ బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

జగన్‌ 2.ఓ సూపర్‌యాప్‌ ఆవిష్కరించిన జగన్ | YS Jagan Launches Jagan 2.0 Super App
Heavy Rain Alert: ఖరీఫ్ సాగుపై ఎండల దెబ్బ రాబోయే 7 రోజులు ఎలా ఉండబోతోందంటే? | AP & Telangana Weather