వేర్పాటువాదం అంటూ సీఎం జగన్‌‌పై అద్నాన్ సమీ విమర్శలు.. వైసీపీ నుంచి స్ట్రాంగ్ కౌంటర్.. తీవ్ర దుమారం..!

Published : Jan 12, 2023, 02:45 PM IST
వేర్పాటువాదం అంటూ సీఎం జగన్‌‌పై అద్నాన్ సమీ విమర్శలు.. వైసీపీ నుంచి స్ట్రాంగ్ కౌంటర్.. తీవ్ర దుమారం..!

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ట్వీట్‌పై ప్రముఖ సింగర్ అద్నాన్ సమీ చేసిన విమర్శలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. అద్నానీ సమీ ట్వీట్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ట్వీట్‌పై ప్రముఖ సింగర్ అద్నాన్ సమీ చేసిన విమర్శలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. అద్నాన్ సమీని విమర్శలను తప్పుబడుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు...’ పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగరీలో ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ పురస్కారం దక్కింది. ఆ పాటకు సంగీతం అందించిన ఎంఎం కీర‌వాణి అవార్డును అందుకున్నారు. ఈ క్రమంలోనే పలువురు ప్రముఖులు ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూటా ట్వీట్ చేశారు. 

‘‘తెలుగు జెండా రెపరెపలాడుతోంది! ఆంధ్రప్రదేశ్ ప్రజల అందరి తరపున నేను కీరవాణి, రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌, మొత్తం ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌కు అభినందనలు తెలుపుతున్నాను. మేము మీ గురించి చాలా గర్వపడుతున్నాం’’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. అయితే సీఎం జగన్ ట్వీట్‌పై అద్నాన్ సమీ విమర్శలు గుప్పించారు. తెలుగు జెండా అని అనడం ఏమిటని ప్రశ్నించిన అద్నాన్ సమీ.. ‘‘మనం మొదట భారతీయులం. అందుకే దయచేసి దేశంలోని మిగిలిన ప్రాంతాల నుంచి మిమ్మల్ని మీరు వేరు చేయడాన్ని ఆపండి. ముఖ్యంగా అంతర్జాతీయంగా, మనం ఒకే దేశం! ఈ వేర్పాటువాద వైఖరి మనం 1947లో చూసినట్లుగా చాలా అనారోగ్యకరమైనది!!! ధన్యవాదాలు... జై హింద్!’’ అని పేర్కొన్నారు. 

 

 

అయితే అద్నాన్ సమీ ట్వీట్‌పై పలువురు వైసీపీ నాయకులు, మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగువాళ్ల దేశభక్తిపై తీర్పు ఇవ్వడానికి అద్నాన్ సమీ ఎవరంటూ ప్రశ్నిస్తున్నారు. అద్నాన్ సమీ 2016లో భారతీయ పౌరసత్వం పొందారని గుర్తు చేస్తున్నారు. సీఎం జగన్ ట్వీట్‌పై అద్నాన్ సమీ చేసిన విమర్శలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ కౌంటర్ ఇచ్చారు. 

 

‘‘మా భాష, మా సంస్కృతి, మా గుర్తింపు గురించి మేము గర్విస్తున్నాము. మేము  తెలుగు  అని నేను మళ్ళీ చెబుతున్నాను. అద్నాన్ సామీ.. మీరు మా దేశభక్తిపై తీర్పు చెప్పేందుకు అధికారం  లేదు’’ అని అమర్‌నాథ్ ట్వీట్ చేశారు. ‘‘తెలుగువాడిని అనే నా గర్వం భారతీయుడిగా నా గుర్తింపును దూరం చేయదు’’ అని అమర్‌నాథ్ పేర్కొన్నారు. 

 

ఇక, అద్నాన్ సమీ వ్యాఖ్యలను వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా తప్పుబట్టారు. అద్నాన్ సమీ వ్యాఖ్యలలో స్పష్టమైన జ్ఞానం లేదని విమర్శించారు. 2016కి ముందు అద్నాన్ సమీ భారతీయ పౌరుడు కానందున అతనిని నిందించలేమని సెటైర్లు వేశారు.  తెలుగు ప్రజలందరూ సహజంగా దేశభక్తి కలిగి ఉంటారని.. ఇందుకు సర్టిఫికేట్ అవసరం లేదని అన్నారు. ‘నాటు-నాటు’ గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెలుచుకుందని.. అందుకే తెలుగు జెండాకు రెఫరెన్స్ అని అన్నారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెలుచుకుంది ‘నాచో-నాచో’ కాదని అన్నారు. 

PREV
click me!

Recommended Stories

మహిళా రిజర్వేషన్ బిల్లు పై Pamula Pushpa Srivani Reaction | Women Reservation | Asianet News Telugu
పవన్‌ కళ్యాణ్‌.. 30వేల మంది మహిళలు ఏమయ్యారు? Vidadala Rajini Comments| Asianet News Telugu