తెలుగుదేశం పార్టీ నుంచి పోటీపై ఆనం క్లారిటీ.. ముందస్తు ఎన్నికలు రావొచ్చని కామెంట్..

By Sumanth KanukulaFirst Published May 23, 2023, 1:41 PM IST
Highlights

మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  తాను ఎంపీగా పోటీ చేస్తానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. 

నెల్లూరు: మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తానని ప్రకటించారు. కొన్ని నెలల క్రితం ఆనం  రామనారాయణరెడ్డిపై వైసీపీ వేటు వేసిన  సంగతి తెలిసిందే.  అయితే తాజాగా నెల్లూరు జిల్లా వరికుంటపాడులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చారు. తాను ఎంపీగా పోటీ చేస్తానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఏ నియోజకవర్గం నుంచైనా ఎమ్మెల్యేగా పోటీ  చేస్తానని చెప్పారు. 

వైసీపీ సర్కార్‌పై ఆ పార్టీ ప్రజాప్రతినిధులతో పాటు నాయకుల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని అన్నారు. ఈ ఏడాది ఆఖరులో ముందస్తు ఎన్నికలు ఉండవచ్చని అన్నారు. ఎన్నికల ముందు 60 శాతం మంది వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులు టీడీపీలో చేరుతారని జోస్యం చెప్పారు. అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయనే ఉద్దేశంతోనే ఇప్పుడే నిర్ణయం తీసుకోలేకపోతున్నారని చెప్పుకొచ్చారు.

ఉమ్మడి  నెల్లూరు జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో టీడీపీ విజయం ఖాయమని స్పష్టంచేశారు. ఇక, ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుతం  ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా  మారాయి.  

click me!