ఆనం అలా వైసీపీలో చేరాడో లేదో.. ఓ వర్గంలో చిచ్చు మొదలైంది. ఆనం రాకను జగన్ స్వాగతించినా.. కొందరు ఆ పార్టీ నేతలు మాత్రం సహించలేకపోతున్నారు.
మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎట్లకేలకు ఆదివారం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. విశాఖ జిల్లా దేవరాయపల్లె సమీపంలోని వ్యాసనం చెరకు కాటా సెంటర్ వద్ద ఆ పార్టీ అధినేత జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఆత్మకూరు, నెల్లూరు నుంచి తరలివెళ్లిన ఆనం అభిమానులు అన్నవరం నుంచి వాహనాల్లో ర్యాలీగా అక్కడికి చేరుకున్నారు.
సాయంత్రం నాలుగు గంటల సమయంలో జగన్ పాదయాత్ర అక్కడకు చేరుకుంది. ఇక్కడి నుంచి వెళ్లిన ఆనం అనుచరులు జగన్కు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగన్ ఆనం రామనారాయణరెడ్డి, రంగమయూర్రెడ్డిలను పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆనం వెంట వెళ్లిన అనుచరులను సైతం జగన్ పార్టీలోకి ఆహ్వానించారు.
ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ తర్వాత అసలు మ్యాటర్ మొదలైంది. ఆనం అలా వైసీపీలో చేరాడో లేదో.. ఓ వర్గంలో చిచ్చు మొదలైంది. ఆనం రాకను జగన్ స్వాగతించినా.. కొందరు ఆ పార్టీ నేతలు మాత్రం సహించలేకపోతున్నారు. వారెవరో కాదు. మేకపాటి. ఆనం వైసీపీలోకి రావడం మొదటి నుంచి మేకపాటి రాజమోహన్ రెడ్డికి ఇష్టం లేదు. ఇదే విషయం నిన్న స్పష్టం అయ్యింది.
ఆనం పార్టీలో చేరేటప్పుడు.. కావాలనే మేకపాటి, ఆయన వర్గీయులు గైర్హాజరయ్యారు. దీంతో.. వైసీపీలో చిచ్చు రేగిందని అందరూ భావిస్తున్నారు. ఇదే కనుక కంటిన్యూ అయితే.. పార్టీలో చీలకలు వచ్చే అవకాశం ఉందని సమాచారం.