వంగవీటి రాధా సీటుపై తేల్చేసిన అంబటి రాంబాబు

By pratap reddyFirst Published Sep 18, 2018, 3:47 PM IST
Highlights

వంగవీటి రాధాకు విజయవాడ సెంట్రల్ సీటు ఇచ్చే విషయంపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు స్పష్టత ఇచ్చారు.

విజయవాడ: వంగవీటి రాధాకు విజయవాడ సెంట్రల్ సీటు ఇచ్చే విషయంపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు స్పష్టత ఇచ్చారు. విజయవాడ సెంట్రల్ సీటు రాధాకు ఇచ్చేది లేదని ఆయన తేల్చేశారు. అయితే వంగవీటి కుటుంబానికి అన్యాయం జరగదని, తగిన గౌరవం, గుర్తింపు ఉంటాయని, ఆ పార్టీ ఆయన అన్నారు. 

తమ పార్టీ అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. వంగవీటి రాధాకు అన్యాయం చేయలనే ఆలోచన తమ పార్టీకి లేదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. రాధా గతంలో విజవాడ ఈస్ట్‌ నుంచి గెలిచారని, అక్కడే ఆయన గెలుస్తారని అధిష్టానం భావిస్తోందని అన్నారు. 

మచిలీపట్నం పార్లమెంట్‌ స్థానం కూడా ఆప్షన్‌ ఇచ్చిందన్నారు. దివంగతనేత రంగా అభిమానులు పార్టీ నిర్ణయాన్ని గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ నిర్ణయాన్ని అందరూ గౌరవించాల్సిందేనని అన్నారు.

చంద్రబాబు టీఆర్‌ఎస్‌తో కలిసుందామని అనుకున్నప్పుడు టీఆర్‌ఎస్‌ వ్యవహారాల్లో ఎందుకు తలదూర్చారని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో దొరికిన తర్వాత హైదరాబాద్‌ నుంచి ఎందుకు పారిపోయి వచ్చారని అడిగారు. ఈ కేసు తర్వాత చంద్రబాబు రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ఒక్కసారైనా మాట్లాడారా అని అడిగారు. 

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ గతంలో రాష్ట్రానికి వస్తే నల్ల జెండాలతో నిరసన తెలిపిన టీడీపీ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉందో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఉన్నప్పుడు ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడలేదని కూడా ఆయన ప్రశ్నించారు. 

హోదా కోసం కర్నూల్‌ జిల్లాలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నా ఎందుకు స్పందించడంలేదని ఆయన చంద్రబాబును నిలదీశారు. ధర్మాబాద్‌ అరెస్ట్‌ వారెంట్‌పై నానా హంగామా చేస్తున్నారని, మహారాష్ట్ర కోర్ట్‌ నోటీసులు ఇస్తే ఇక్కడ ధర్మాలు చేయడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు.

click me!