అలిపిరి వద్ద ముగిసిన అమరావతి రైతుల మహాపాదయాత్ర.. రేపు శ్రీవారి దర్శనం చేసుకోనున్న రైతులు

By Sumanth KanukulaFirst Published Dec 14, 2021, 5:04 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతిని (Amaravati) కొనసాగించాలని అమరావతి ప్రాంత రైతులు, మహిళలు చేపట్టిన  మహాపాదయాత్ర నేడు ముగిసింది. రైతులు మహాపాదయాత్రను (Amaravati Farmers padayatra) తిరుపతిలోని అలిపిరి శ్రీవారి పాదాల వద్ద ముగించారు. 

ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతిని (Amaravati) కొనసాగించాలని అమరావతి ప్రాంత రైతులు, మహిళలు చేపట్టిన  మహాపాదయాత్ర నేడు ముగిసింది. వారి మహాపాదయాత్రను (Amaravati Farmers padayatra) తిరుపతిలోని అలిపిరి శ్రీవారి పాదాల వద్ద ముగించారు. అమరావతినే శాశ్వత రాజధానిగా కొనసాగించాలని కొబ్బరి కాయలు కాట్టి తిరుమల శ్రీవారిని వేడుకున్నారు. ఈ సమయంలో రైతుల గోవింద నామస్మరణతో అలిపిరి ప్రాంతం మారుమోగింది. జై అమరావతి, జైజై అమరావతి అంటూ రైతులు నినాదాలు చేశారు. 

అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు, మహిళలు న్యాయస్థానం నుంచి దేవస్తానం వరకు పాదయాత్ర కొనసాగించారు. నవంబర్ 1న తుళ్లూరు నుంచి మొదలై పాదయాత్ర గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని పలు గ్రామాల మీదుగా సాగింది. దాదాపు 450 కి.మీ మేర రైతులు పాదయాత్ర చేశారు. 44 రోజుల పాటు సాగిన రైతుల పాదయాత్ర నేడు తిరుపతికి చేరుకుంది. నేడు మొత్తంగా 9 కి.మీ మేర రైతుల పాదయాత్ర సాగింది. చివరి రోజు రైతుల పాదయాత్రకు భారీగా జనాలు తరలివచ్చి మద్దతు పలికారు. 

రైతులు శ్రీవారిని దర్శించుకోవడానికి టీటీడీ అనుమతి..
పాదయాత్ర చేపట్టిన రైతులు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam) అనుమతించింది. కరోనా నిబంధనలు పాటిస్తూ శ్రీవారిని దర్శించుకోవాలని టీడీపీ తెలిపింది. రేపు, ఎల్లుండి రైతులు శ్రీవారి దర్శనం చేసుకోవడానికి టీటీడీ అధికారులు అనుమతించారు. 

ముగింపు సభ అనుమతిపై రేపు హైకోర్టులో విచారణ..
న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు మహా పాదయాత్ర చేపట్టిన అమరావతి ప్రాంత రైతులు డిసెంబర్ 17న తిరుపతిలో అమరావతి ఆకాంక్షను చాటేలా బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తున్నారు. అయితే ఇందుకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో.. అమరావతి రైతులు ఏపీ హైకోర్టును (AP High Court) ఆశ్రయించారు. తిరుపతిలో రాజధాని రైతుల బహిరంగ సభకు అనుమతి ఇవ్వాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం సభను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటుందని పిటిషన్‌లో పేర్కొంది. పోలీసులు అసంబద్ధ కారణాలు  చూపుతున్నారని పిటిషననర్ల తరఫు లాయర్ పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టనున్నట్టుగా ఏపీ హైకోర్టు తెలిపింది.

click me!