amalapuram violence : గాల్లోకి కాల్పులు.. సురక్షిత ప్రాంతాలకు ప్రజా ప్రతినిధులు, అమలాపురానికి చేరుకున్న డీఐజీ

By Siva KodatiFirst Published May 24, 2022, 8:00 PM IST
Highlights

కోనసీమ జిల్లా పేరు మార్పుపై ఆందోళన నేపథ్యంలో అమలాపురానికి అదనపు బలగాలు చేరుకుంటున్నాయి. ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు స్వయంగా పరిస్ధితిని సమీక్షిస్తున్నారు. ఆయన అమలాపురానికి చేరుకుని సిబ్బందికి దిశానిర్దేశం చేస్తున్నారు. 

కోనసీమ జిల్లాకు (konaseema district) అంబేద్కర్ పేరు పెట్టొద్దంటూ మంగళవారం జరిగిన నిరసన ఉద్రిక్త పరిస్ధితులకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమలాపురంలో హింసాత్మక పరిస్ధితులు (amalapuram voilenece) చోటు చేసుకున్నాయి. పోలీసులపై ఆందోళనకారులు లాఠీ చేయడంతో దాదాపు 20 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆగ్రహంతో ఊగిపోయిన నిరసనకారులు మంత్రి పినిపే విశ్వరూప్, ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్ నివాసాలకు నిప్పు పెట్టారు. ఈ క్రమంలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు అమలాపురంలో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. 

అటు పరిస్ధితిని సమీక్షించేందుకు ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు అమలాపురానికి చేరుకున్నారు. మరోవైపు ఉద్రిక్త పరిస్ధితుల నేపథ్యంలో పట్టణంలో భారీగా పోలీసులు మోహరించారు. ఆందోళన విరమించి వెళ్లిపోవాలని పోలీసులు నిరసనకారులను కోరుతున్నారు. అటు అమలాపురం ప్రాంతంలో వున్న ప్రజా ప్రతినిధులందరినీ పోలీసులు సురక్షిత  ప్రాంతాలకు తరలించి... పట్టణంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ప్రస్తుతం అమలాపురంలో అంధకారం నెలకొంది. 

హింసాత్మక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఐజీ పాలరాజు హెచ్చరించారు. ఎవరూ హింసకు పాల్పడి భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని ఆయన సూచించారు. ఒక్కసారిగా 4 వేల మంది వచ్చారని.. ఆందోళన కారులపై చర్యలు వుంటాయన్నారు. సీసీ ఫుటేజ్ ద్వారా ఆందోళనకారులను గుర్తిస్తామని.. అమలాపురం పూర్తిగా కంట్రోల్‌లో వుందన్నారు. ఎవరూ పుకార్లు నమ్మొద్దని డీఐజీ సూచించారు. 

మరోవైపు ఈ ఘటనపై మంత్రి విశ్వరూప్ (minister viswarup) మాట్లాడుతూ.. తన ఇంటిని తగులబెట్టడం దురదృష్టకరమన్నారు. జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడం గర్వకారణమని.. టీడీపీ, జనసేన, బీజేపీ డిమాండ్ చేస్తేనే అంబేద్కర్ పేరు పెట్టామని విశ్వరూప్ తెలిపారు. ఇప్పుడు ఆ పార్టీలు మాట మార్చాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నాని ఆయన ఆరోపించారు. అందరినీ వేడుకుంటున్నానని.. మీ అభ్యంతరాలు పరిశీలిస్తామని  మంత్రి స్పష్టం చేశారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ జరుగుతున్న ఆందోళనలపై ఏపీ హోంమంత్రి తానేటి వనిత (taneti vanitha) స్పందించారు. అంబేద్కర్ పేరు వ్యతిరేకించడం సరికాదని ఆమె హితవు పలికారు. కోనసీమ ఆందోళన వెనుక టీడీపీ, జనసేన పార్టీలు వున్నాయని హోంమంత్రి ఆరోపించారు. 

ఇకపోతే.. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా కోనసీమ జిల్లా పేరును మార్చిన సంగతి తెలిసిందే. దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, పార్టీలు ఇచ్చిన వినతి మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 18న డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే కోనసీమ జిల్లాగానే పేరును కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆందోళనలు నిర్వహిస్తుంది. ఇదే సమయంలో బహిరంగ సభలు, ర్యాలీలకు అనుమతి లేదని కూడా పోలీసులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఆంక్షలు విధించారు.

కోనసీమ జిల్లా పేరును కొనసాగించాలని కొందరు, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు ఉండాలని మరో వర్గం వాదిస్తుంది. రెండు వర్గాలు పోటా పోటీగా  సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నాయి. ఈ రెండు వర్గాలు తమ వాదనలను సమర్ధించుకుంటున్నాయి. అయితే అందరి కోరిక మేరకే డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చామని  మంత్రి పినిపె విశ్వరూప్ చెప్పారు. 

click me!