తారకరత్న హెల్త్ అప్‌డేట్.. బెంగళూరు‌లోని ఆస్పత్రికి తారకరత్న.. ఐసీసీయూలో కొనసాగుతున్న చికత్స..!

By Sumanth KanukulaFirst Published Jan 28, 2023, 9:47 AM IST
Highlights

ప్రముఖ సినీ నటుడు నందమూరి తారకరత్నకు గుండెపోటు రావడంతో కుప్పంలోని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మెరుగైన చికిత్స కోసం గత రాత్రి తారకరత్నను బెంగళూరులోని ఆస్పత్రికి తరలించారు. 

ప్రముఖ సినీ నటుడు నందమూరి తారకరత్నకు గుండెపోటు రావడంతో కుప్పంలోని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం గత రాత్రి తారకరత్నను బెంగళూరులోని ఆస్పత్రికి తరలించారు. కుప్పంలోని పీఈసీ ఆస్పత్రి నుంచి ప్రత్యేక అంబులెన్స్‌లో బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తారకరత్నను తరలించారు. తారకరత్న వెంట ఆయన భార్య అలేఖ్య రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు కూడా బెంగళూరులోని ఆస్పత్రికి చేరుకున్నారు. 

ప్రస్తుతం నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కార్డియాక్ కేర్ యూనిట్(ఐసీసీయూ)‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు ఎక్మో చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. తారకరత్న ఆరోగ్య పరిస్థితి, చికిత్సకు సంబంధించి అంశాలను నందమూరి బాలకృష్ణతో పాటు ఇతర కుటుంబ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఇతర కుటుంబ సభ్యులు కూడా ఎప్పటికప్పుడూ వివరాలు అడిగి తెలుసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక, కాసేపట్లో తారకరత్న హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుసుకున్నారు. 

అసలేం జరిగిందంటే.. 
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పేరుతో నిర్వహిస్తున్న పాదయాత్రను శుక్రవారం కుప్పం నుంచి ప్రారంభించారు. లోకేష్ వెంట బాలకృష్ణ, తారకరత్నలు కూడా ఉన్నారు. పాదయాత్ర ప్రారంభం సందర్భంగా కుప్పంలోని దేవాలయాలు, మసీదు, చర్చిలను లోకేష్ సందర్శించారు. మసీదులో ప్రార్థనలు ముగించుకుని బయటకు రాగానే ఒక్కసారిగా తారకరత్నకు కళ్లు తిరిగి కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే అక్కడి వారు తారకరత్నను వాహనాల్లో కుప్పంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత సమీపంలోని పీఈఎస్‌ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు నటుడికి సీపీఆర్‌, యాంజియోగ్రామ్‌ చేశారు. 

మరోవైపు ఈ విషయం తెలుసుకున్న బాలకృష్ణ వెంటనే ఆస్పత్రికి చేరుకుని అక్కడే ఉండిపోయారు. ఆస్పత్రి వైద్యులతో మాట్లాడుతూ తారకరత్న ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించారు. ఆస్పత్రి వద్ద మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ.. తారకరత్న ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని, అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదని అన్నారు. ఇక, చంద్రబాబు ఆస్పత్రి వైద్యులు, బాలకృష్ణ, టీడీపీ నాయకులతో మాట్లాడుతూ తారకరత్న ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. 

మరోవైపు మెరుగైన చికిత్స కోసం తారకరత్నను బెంగళూరు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి చెందిన కొందరు వైద్యులు కూడా కుప్పం చేరుకున్నారు. ఇక, శుక్రవారం రాత్రి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు పీఈఎస్‌ ఆస్పత్రికి చేరుకున్నారు. వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకనున్నారు. అనంతరం శుక్రవారం రాత్రి ప్రత్యేక అంబులెన్స్‌లో తారకరత్నను బెంగళూరుకు తరలించారు. బాలకృష్ణ కూడా బెంగళూరు వెళ్లారు. వైద్యులతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు.

click me!