చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా: బాబు న్యాయవాదులపై జడ్జి అసహనం

Google News Follow Us

సారాంశం

చంద్రబాబు పై దాఖలు చేసిన పిటిషన్లపై విచారణలను  రేపు విచారిస్తామని ఏసీబీ కోర్టు ఇవాళ తెలిపింది.

అమరావతి: చంద్రబాబుపై దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను  రేపటికి వాయిదా వేసింది విజయవాడ ఏసీబీ కోర్టు.చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లను రేపు విచారిస్తామని  ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సోమవారంనాడు తెలిపారు.చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఏ పిటిషన్ పై విచారణ జరపాలనే దానిపై   చంద్రబాబు లాయర్లు,  సీఐడీ తరపు లాయర్ల మధ్య  వాదోపవాదనలు జరిగాయి. 

కస్టడీ పిటిషన్  కంటే బెయిల్ పిటిషన్ పై విచారణ జరపాలని  చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు. అయితే  ఈ సమయంలో ఏ పిటిషన్ పై విచారణ జరపాలో  తమకు తెలుసునని  ఏసీబీ కోర్టు జడ్జి చెప్పారు. ఈ సమయంలో చంద్రబాబు తరపు న్యాయవాదులపై ఏసీబీ కోర్టు జడ్జి అసహనం వ్యక్తం చేశారు.  అయితే ఈ విషయమై  ఇరు వర్గాల న్యాయవాదులు  తమ వాదనలు వినాలని పట్టుబట్టారు.

ఈ నెల  14వ తేదీన చంద్రబాబు బెయిల్ పిటిషన్ ను వేసినట్టుగా  చంద్రబాబు తరపు న్యాయవాదులు గుర్తు చేశారు. చంద్రబాబును ఇప్పటికే రెండు రోజుల పాటు  సీఐడీ కస్టడీకి తీసుకుందని  చంద్రబాబు తరపు న్యాయవాదులు గుర్తు చేశారు.  సీఐడీ కస్టడీ అవసరం లేదని  చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదించారు.  ఇరు వర్గాల న్యాయవాదులు తమ వాదనలను సమర్ధించుకుంటూ వాదనలు వినిపించారు. దీంతో చంద్రబాబు బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్లపై రేపు విచారణ నిర్వహిస్తామని  ఏసీబీ కోర్టు జడ్జి ప్రకటించారు.

also read:విచారణకు చంద్రబాబు సహకరించలేదు: సీఐడీ తరపు న్యాయవాది వివేకానంద

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రెండు రోజుల పాటు చంద్రబాబును విచారించిన కూడ ఏ మాత్రం సహకరించలేదని సీఐడీ ఆరోపిస్తుంది. ఈ విషయమై చంద్రబాబును  మరోసారి కస్టడీ కోరుతూ  సీఐడీ తరపు న్యాయవాదులు  ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై  ఇవాళ విచారణను ప్రారంభించనున్నట్టుగా ఏసీబీ కోర్టు తెలిపింది. అయితే  సీఐడీ కస్టడీ పిటిషన్ కంటే ముందుగానే చంద్రబాబు బెయిల్ పిటిషన్లపై విచారణ జరపాలని బాబు తరపు న్యాయవాదులు  పట్టుబట్టారు. 

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఈ నెల 9న చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో చంద్రబాబు రాజమండ్రి జైలులో రిమాండ్ లో ఉన్నారు.  వచ్చే నెల 5వ తేదీ వరకు  చంద్రబాబు రిమాండ్ లో ఉండనున్నారు.ఇదిలా ఉంటే ఈ నెల 23, 24 తేదీల్లో చంద్రబాబును  సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. అయితే  ఈ రెండు రోజుల విచారణలో చంద్రబాబు సహకరించలేదని సీఐడీ ఆరోపిస్తుంది. ఈ కారణంగానే మరోసారి చంద్రబాబు కస్టడీకి కోరుతూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబు బెయిల్,  సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్లపై  రేపు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది.