ఏపీలో మళ్లీ కరోనా కలకలం... ఒకే స్కూల్లో పదిమందికి పాజిటివ్

By Arun Kumar PFirst Published Aug 23, 2021, 1:29 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ లో మళ్లీ కరోనా కలకలం మెళ్లిమెళ్లిగా మొదలవుతోంది. ఇటీవల రాష్ట్రంలో స్కూల్స్ ఓపెన్ కాగా తాజాగా ఒకే స్కూల్లో పదిమందికి కరోనా పాజిటివ్ గా తేలింది.

విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ లో మళ్లీ కరోనా కలకలం మొదలయ్యింది. సెకండ్ వేవ్ తర్వాత ఇటీవలే తెరుచుకున్న స్కూల్స్ లో ఒక్కోటిగా కరోనా కేసులు బయటపడుతున్నాయి. తాజాగా కృష్ణా జిల్లాలోని  ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. ముదినేపల్లి మండలంలోని పెదపాలపర్రు జడ్పి ఉన్నత పాఠశాల, గురజ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో నిర్వహించిన కొవిడ్ పరీక్షల్లో 11 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. 

పెదపాలపర్రు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ర్యాండమ్ గా నిర్వహించిన పరీక్షల్లో తొమ్మిదో తరగతి విద్యార్థులు నలుగురు, టిసి తీసుకునేందుకు వచ్చిన నలుగురు పదవ తరగతి విద్యార్థులు, ఇద్దరు తల్లిదండ్రులకు పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. గురజ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన పరీక్షల్లో మూడో తరగతి విద్యార్థికి కొవిడ్ నిర్ధారణ అయింది. 

వీడియో

పాఠశాలల్లో కరోనా కేసులు బయటపడటంతో అప్రమత్తమైన మండల విద్యాశాఖ అధికారులు పెదపాలపర్రు జడ్పీ పాఠశాలకు సోమ, మంగళ వారాలు సెలవు ప్రకటించారు. గురజ పాఠశాలకు చెందిన అన్ని తరగతుల విద్యార్థులకు కొవిడ్  పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

పాఠశాలల్లో పరిస్థితి  అదుపు తప్పకుండా  అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నామని మండల విద్యాశాఖ అధికారి నరేష్ తెలియజేశారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు అవసరమైతే పెదపాలపర్రు జడ్పీ ఉన్నత పాఠశాలకు సెలవులు పొడిగిస్తామని ఆయన చెప్పారు. మండలంలోని ఇతర పాఠశాలల్లో కూడా అన్ని తరగతుల విద్యార్థులకు ర్యాండమ్ కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని ఎంఈఓ నరేష్ తెలిపారు. 

read more  ప.గోదావరిలో కరోనా ఉధృతి: ఏపీలో మొత్తం కేసులు 20,02,340కి చేరిక

ఇదిలావుంటే రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 57,745 మంది శాంపిల్స్ ను పరీక్షిస్తే 1085 మందికి కరోనా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో కరోనా కేసులు 20,02,340 లక్షలకు చేరుకొన్నాయి. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. దీంతో  రాష్ట్రంలో మొత్తం  కరోనా మరణాల సంఖ్య 13,723కి చేరింది. 

గడిచిన 24 గంటల్లో 1541మంది కోవిడ్‌ నుంచి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుండి 19 లక్షల 73వేల 940 మంది కోలుకొన్నారు. ఏపీలో ప్రస్తుతం 14,677 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,60,91,962 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. 
 

click me!