ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కడప జిల్లాలో వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో ముదిరెడ్డిపల్లె తండా నుండి బైరవకోనకు వెళ్లే రహదారిలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో దర్శనానికి వెళ్లిన భక్తుల ట్రాక్టర్లు మోట్ల పెద్ద వంక వాగులో చిక్కుకుపోయాయి.
కడప జిల్లా మైదుకూరు మండలం నల్లమల అడవిలోని మొండి భైరవుడి మొక్కు తీర్చుకునేందుకు వెళ్ళిన 50 మంది భక్తులు వాగులో చిక్కుకుపోయారు. ఆదివారం మధ్యాహ్నం భారీగా వర్షాలు కురవడంతో ముదిరెడ్డిపల్లె తండా నుండి బైరవకోనకు వెళ్లే రహదారిలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో దర్శనానికి వెళ్లిన భక్తుల ట్రాక్టర్లు మోట్ల పెద్ద వంక వాగులో చిక్కుకుపోయాయి. దీంతో భక్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు .
సమాచారం అందుకున్న మైదుకూరు డిఎస్పి విజయ్ కుమార్ సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మధ్యాహ్నం నుంచి వర్షాలు కురుస్తూ ఉండడంతో నలికిరి సెల నుండి మోట్ల పెద్ద వంక ఉధృతంగా ప్రవహిస్తోందని తెలిపారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం లేదని పేర్కొన్నారు. మోట్ల పెద్ద వంక అవతల చిక్కుకున్న వారికి ఆహారము మంచినీళ్లు అందిస్తున్నట్లు డీఎస్పీ వివరించారు. ఎవరూ భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదని.. వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో సహాయక చర్యలు ఆలస్యమవుతున్నాయన్నారు. చీకటి పడడంతో వాగులోకి ఎవరినీ వెళ్లనీయకుండా చర్యలు చేపట్టామన్నారు. రేపు ఉదయం సహాయక చర్యలు ప్రారంభిస్తామని డీఎస్పీ స్పష్టం చేశారు.