కరోనాను జయించిన ముగ్గురు కర్నూలు వాసులు...: కలెక్టర్ వీరపాండియన్

By Arun Kumar PFirst Published Apr 25, 2020, 11:03 AM IST
Highlights

కర్నూల్ జిల్లాను కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ విపత్కర సమయంలో ఈ మహమ్మారి నుండి ముగ్గురు బయటపడ్డారు. 

కర్నూల్: ప్రాణాంతక కరోనా మహమ్మారిని జయించిన ముగ్గురు నిన్న రాత్రి సంపూర్ణ ఆరోగ్యంతో తమ తమ ఇళ్లకు చేరుకున్నట్లు కర్నూల్ జిల్లా కలెక్టర్ల జి.వీరపాండియన్ వెల్లడించారు. ఈ నెల 5న కరోనాతో బాధపడుతూ కరోనా ఆస్పత్రిలో చేరిన ఈ ముగ్గురికి కరోనా నుండి పూర్తిగా బయటపడటంతో ఇంటికి పంపించినట్లు కలెక్టర్ వెల్లడించారు. దీంతో కర్నూల్ జిల్లాలో ఇప్పటివరకు మొత్తం ఏడుగురు ఈ  కరోనా మహమ్మారి నుండి బయటపడ్డారు.  

ఏపి నుండి ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ కు వెళ్లిన కొందరు కరోనా బారినపడ్డారు. ఇలా మల్యాల వాసి(పురుషుడు 52 సం. లు), నంద్యాల వాసి (యువకుడు 28 సం. లు), కోడుమూరు వాసి(యువకుడు 29 సం. లు) కూడా  కరోనా బారినపడ్డారు. దీంతో వారు గతకొన్నిరోజులుగా కర్నూల్ పట్టణంలోని శాంతిరామ్ ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందారు. 

వీరికి వైద్యసిబ్బంది మెరుగైన చికిత్స అందించడమే కాదు ప్రభుత్వం మంచి ఆరోగ్యవంతమైన ఆహారం అందించి రోగనిరోధక శక్తి పెంపొందేలా చేశారు.  దీంతో ఈ  ముగ్గురు తాజాగా కరోనా బారినుండి బయటపడ్డారు. వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, జిల్లా యంత్రాంగం కృషితో వీరు కరోనా మహమ్మారిని జయించారు. 

శుక్రవారం కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం రెండుసార్లు రిపీట్ టెస్ట్ లను చేయించి నెగటివ్ ఫలితం రావడంతో  శుక్రవారం రాత్రి డిశ్చార్జ్ చేశారు.  డిశ్చార్జ్ అయిన ఆ ముగ్గురిని శాంతిరామ్ కోవిడ్ ఆస్పత్రి సిబ్బంది ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. వారిని ప్రత్యేక అంబులెన్స్ వాహనాల్లో ఇంటికి పంపినట్లు కోవిడ్ హాస్పిటల్ స్పెషల్ ఆఫీసర్ నారాయణమ్మ, డాక్టర్లు చంద్రశేఖర్ లు తెలిపారు.

కరోనా బారిన పడినా తమ నుండి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టనీయకుండా మొత్తం ప్రభుత్వం తరఫునే భరించిందని డిశ్చార్జి అయినవారు తెలిపారు. తమను ఆరోగ్యంగా ఇంటికి పంపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి, ప్రభుత్వానికి, డాక్టర్లు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ వీరపాండియన్  కు వారు కృతజ్ఞతలు తెలిపారు.  

 

click me!