ఆంధ్ర ప్రదేశ్ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని జేఏసి ఛైర్మన్ సుంకర కృష్ణమూర్తి ముఖ్యమంత్రి జగన్ ను ను కోరారు. లేదంటే ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
విజయవాడ: గత 30రోజులుగా రాజధాని ప్రాంత రైతులు, ప్రజలు నిరసనలు దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని ఆంధ్ర జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ సుంకర కృష్ణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. బూటకపు కమిటీలు వేసి రాజధానిని విశాఖకు తరలించాలని చూడటం దుర్మార్గమని... ఈ బూటకపు కమిటీల సలహాలు, సూచనలను ప్రభుత్వం పట్టించుకోవద్దని కృష్ణమూర్తి అన్నారు.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయం లేకుండా రాజధానిని తరలించడం సీఎం జగన్ కు సాధ్యం కాదని అన్నారు. రాజధాని కోసం రైతులు మరణించినా కూత వేటు దూరంలో ఉండి కూడా ముఖ్యమంత్రి జగన్ పరామర్శించకపోవడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. ప్రతిపక్షం, ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోకుండా 151మంది ఎమ్మెల్యేలు ఉన్నారని విర్రవీగడం సరికాదన్నారు.
read more సచివాలయం శాశ్వతమని బాబు నిరూపిస్తే తలదించుకొని వెళ్తా: బొత్స సవాల్
అధికారం ఉందని ఎలా చేసిన చెల్లుతుంది అనుకోవద్దని హెచ్చరించారు. రాజకీయ లబ్ది, స్వార్థాల కోసం కుల, మత, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాన్ని ఆపాలని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ వైఖరి మార్చుకుని అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిరసన కార్యక్రమాలు, సభలు, ఆందోళనలు చేపడతామని కృష్ణమూర్తి హెచ్చరించారు.