ఈటల - కౌశిక్ రెడ్డి కోసం అంబేద్కర్ చౌరస్తాలో కుర్చీలు... చర్చలకు సర్వం సిద్దం

Aug 5, 2022, 11:49 AM IST

కరీంనగర్ : సవాళ్ళు ప్రతిసవాళ్ళతో కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. హుజురాబాద్ నడిబొడ్డున తనతో ఇవాళ (ఆగస్ట్ 5వ తేదీ) చర్చకు రావాలంటూ స్థానిక బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి సవాల్ విసిరిన విషయం తెలిసిందే. అయితే టీఆర్ఎస్ పార్టీ కేవలం మాటలకే పరిమితం కాకుండా హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో చర్చల కోసం ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఈటలను చర్చలకు రమ్మంటూ భారీ హోర్డింగ్ ఏర్పాటుచేసిన టీఆర్ఎస్ ఇవాళ చర్చా వేదికను కూడా సిద్దం చేసింది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అంటూ రెండు కుర్చీలతో ఓ వేదికను ఏర్పాటుచేసారు. గురువారం అంబేద్కర్ చౌరస్తాలో పోటాపోటీగా జెండాల ఏర్పాటుకు టీఆర్ఎస్, బిజెపి శ్రేణులు సిద్దపడటంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వీరి తోపులాటలో స్థానిక సీఐ శ్రీనివాస్ గాయపడ్డారు. దీంతో ఇవాళ కూడా ఉద్రిక్తత తలెత్తే  అవకాశాలుండంతో భారీగా పోలీసులను మోహరించారు.