తెలంగాణను ఆంధ్రాలో కలిపే కుట్రలు.. అందుకే గుంటనక్కల ఎంట్రీ : మంత్రి గంగుల సంచలనం

Dec 22, 2022, 5:05 PM IST

కరీంనగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ సుపరిపాలనతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా మారిందని... ఈ సంపదపై కన్నేసిన ఆంధ్రా నాయకులు మళ్లీ రాష్ట్రంలోని గుంటనక్కల్లా ఎంటరవుతున్నారని మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. వైఎస్ షర్మిల, పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు, సజ్జల రామకృష్ణారెడ్డి మూలాలు ఆంధ్ర ప్రదేశ్ లోనే... వీరికి తెలంగాణ గడ్డపై ఏం పని అని మంత్రి ప్రశ్నించారు. వీళ్లంతా హైదరాబాద్ సంపదను కొళ్లగొట్టి మళ్లీ ఆంధ్రాకు తరలించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.  సుభిక్షంగా వున్న తెలంగాణను ఆంధ్రలో కలిపడమే వీరందరి లక్ష్యమని గంగుల సంచలన వ్యాఖ్యలు చేసారు. తెలంగాణలోని కాళేశ్వర ప్రాజెక్టును పగలగొట్టి నీటిని, సింగరేణి బొగ్గును తవ్వి దోచుకెళ్లాలి, కరెంట్ ను తీసుకెళ్లి మళ్లీ రాష్ట్రాన్ని గుడ్డిదీపం చేయాలని ఆంధ్రా నాయకులు చూస్తున్నారని మంత్రి గంగుల ఆరోపించారు. వీరి కుట్రలను గ్రహించి తెలంగాణ సమాజం మేలుకోకుంటే గతంలో మనం పడ్డ కష్టాలే భవిష్యత్ లో మన పిల్లలు పడాల్సి వస్తుందని హెచ్చరించారు. కాబట్టి తిరుగుబాటు మొదలుపెట్టాలి ప్రజలకు మంత్రి గంగుల పిలుపునిచ్చారు.