వైసిపి ఎమ్మెల్యే శ్రీదేవికి చేదు అనుభవం... గడపగడపకు కార్యక్రమంలో నిలదీత

Dec 21, 2022, 11:36 AM IST

గుంటూరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్న కొందరు వైసిపి ప్రజాప్రతినిధులు ప్రజల తిరుగుబాటుకు గురవుతున్నారు. ఇలా ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు కొందరికి చేదు అనుభవాలు ఎదురవగా తాజాగా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి అలాంటి అనుభవమే ఎదురయ్యింది. ఉద్దండ్రాయునిపాలెం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్యెల్యే శ్రీదేవికి సొంత పార్టీ వారి నుండే వ్యతిరేకత ఎదురయ్యింది. వైసిపి పాలనలో వ్యక్తిగతంగా జరిగిన లబ్ది గురించి ఎమ్మెల్యే వివరిస్తుండగా ఇది సరే మరి నడవడానికి కూడా రాకుండా పాడయిపోయిన రోడ్లు వేయండి అని ఓ మహిళ ఎమ్మెల్యేను అడిగారు. పథకాలు ఇస్తున్నాం కదా... రోడ్డు తర్వాత చూద్దాం అంటూ ఎమ్మెల్యే మాట దాటవేస్తూ ముందుకు వెళ్లిపోయారు. ఇక స్థానిక రైతులు కూడా గత నాలుగేళ్లుగా తమకు ప్రభుత్వం నుండి కౌలు రావడంలేదని ఎమ్మెల్యే శ్రీదేవిని నిలదీసారు.  ముఖ్యంగా ఎస్సీ  రైతులకు కౌలు నిలిపివేసారని... ఇలాంటి పరిస్థితుల్లో క్రిస్మస్ పండగ ఎలా ఆనందంగా జరుపుకుంటామంటూ అడిగారు. కౌలు రాకపోతే నేనేం చేయాలంటూ శ్రీదేవి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో మా ఎమ్మెల్యే మిమ్మల్సి కాకుండా ఇంకెవరిని అడగాలంటూ బాధితులు ప్రశ్నించారు.