విజయవాడ వద్ద కృష్ణమ్మ పరవళ్లు... దుర్గామల్లేశ్వర స్వామివార్ల తెప్పోత్సవానికి బ్రేక్

Oct 4, 2022, 1:02 PM IST

విజయవాడ : నవరాత్రి వేడుకల్లో భాగంగా ప్రతిఏడాది కన్నులపండగగా జరిగే శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల నదీ విహారానికి ఈసారి బ్రేక్ పడింది. పులిచింతల నుండి దాదాపు లక్ష క్యూసెక్కుల నీరు దిగువకు వదుతుండటంతో విజయవాడ సమీపంలో కృష్ణా నది ప్రవాహం ఉదృతంగా వుంది. ఇలాంటి సమయంలో సాంప్రదాయబద్దంగా స్వామి వార్లకు నిర్వహించే నదీ విహారం సాధ్యపడదని జల వనరుల శాఖ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డిల్లీ రావుకు నివేదించింది. దీంతో ఈసారి నది ఒడ్డునే హంసవాహనంపై దుర్గామల్లేశ్వరస్వామి వార్లకు పూజాది కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ పూజాది కార్యక్రమాలు తిలకించేందుకు భక్తులకు ప్రకాశం బ్యారేజి, పున్నమిఘాట్, ఫ్లై ఓవర్, దుర్గాఘాట్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. తెప్పోత్సవాన్ని తిలకించేందుకు భారీగా భక్తుల వచ్చే అవకాశముంది కాబట్టి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఆలయ అధికారులు తెలిపారు.