ఉయ్యూరు తిరునాళ్లలో బ్లేడ్ బ్యాచ్ వీరంగం... భక్తులపై విచక్షణారహితంగా దాడి

Feb 2, 2023, 11:15 AM IST

పెనమలూరు : కృష్ణా జిల్లా ఉయ్యూరులో బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించింది. వీరమ్మతల్లి తిరునాళ్ళను పురస్కరించుకుని గత రెండ్రోజులుగా ఉయ్యూరు విధుల్లో అమ్మవారిని ఊరేగిస్తున్నారు. దీంతో భక్తులు భారీగా వీధుల్లోకి చేరి అమ్మవారిని దర్శించుకునే క్రమంలో కొందరు యువకులు అలజడి సృష్టించారు. ప్రశాంతంగా సాగుతున్న తిరునాళ్లలో యువకుల బ్యాచ్ గొడవలు సృష్టించే ప్రయత్నం చేయగా ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసారు. ఈ క్రమంలోనే నోట్లోంచి బ్లేడ్ లు తీసిన యువకులు అడ్డువచ్చిన వారిపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. ఈ బ్లేడ్ బ్యాచ్ దాడిలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బ్లేడ్ బ్యాచ్ దాడిలో కందిపోటీ దుర్గాప్రసాద్(30) అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతడి మెడ మీద తీవ్ర గాయాలయి తీవ్ర రక్తస్రావం కావడంతో ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతడికి  18 కుట్లు పడ్డాయి. అకారణంగా బ్లేడ్లతో దాడికి పాల్పడి హల్ చల్ చేసిన యువకుల గ్యాంగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.