వైసిపి ఏజెంట్ గా ఆంధ్రా యూనివర్సిటి విసి... ఎన్నికల సంఘానికి టిడిపి ఫిర్యాదు

Feb 20, 2023, 4:13 PM IST

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ సర్కార్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆరోపించారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఏకంగా ఆంధ్రా యూనివర్సిటి వీసి ప్రసాదరెడ్డి వైసిపి ఏజెంట్ గా పనిచేస్తున్నాడని ఆరోపించారు. కాబట్టి వెంటనే ప్రసాదరెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆనంద్ బాబు, అశోక్ బాబుతో లతో కూడిన టిడిపి బృందం ఎన్నికల ప్రధానాదికారి ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేసారు.  

ఈ సందర్భంగా ఆనంద్ బాబు మాట్లాడుతూ... ప్రసాదరెడ్డి యూనివర్సిటీ విసిలా కాకుండా వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి చెంచాలా వ్యవహరిస్తున్నాడని అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ లాంటి గొప్ప వ్యక్తులు విసిగా పనిచేసిన ఆంధ్రా యూనివర్సిటీని ఈ ప్రసాదరెడ్డి వైసిపి ప్రాంతీయ కార్యాలయంగా మార్చేసాడని ఆరోపించారు. వైసిపికి మద్దతుగా ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలతో విసి సమావేశం ఏర్పాటుచేసాడని... విషయం తెలిసి సిపిఎం నాయకులు హోటల్ వద్దకు వెళ్లడంతో పారిపోయాడని అన్నారు. ఇలా జగన్ సర్కార్ అధికారులతో అక్రమాలు చేయిస్తోందని ఆనంద్ బాబు ఆరోపించారు.