
భద్రాద్రి చుంచుపల్లిలో దారుణం చోటుచేసుకుంది. మహిళపై పదునైన ఆయుధంతో ఓ వ్యక్తి దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. వివరాలు.. ఆర్థిక లావాదేవీల కారణంగా శ్రీదేవి అనే మహిళపై నవతన్ దాడి చేశాడు. శ్రీదేవి తన వద్ద అప్పు తీసుకుందని.. తిరిగి ఇవ్వమంటే జాప్యం చేస్తుందని నవతన్ ఆరోపించాడు. ఈ క్రమంలోనే ఆమె దాడి చేసినట్టుగా చెబుతున్నాడు. శ్రీదేవిపై పదునైన ఆయుధంతో దాడి చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు వెంటనే దగ్గర్లో ఉన్న కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలికి చికిత్స కొనసాగుతుండగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక, దాడి చేసిన అనంతరం నిందితుడు నవతన్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.