కారు గుర్తును పోలిన 8 గుర్తులను తొలగించాలని రాసిన లేఖకు ఎన్నికల కమీషన్ నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో టీఆర్ఎస్ వ్యూహం మార్చింది. రేపు తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయాలని నిర్ణయించింది.
మునుగోడు ఉపఎన్నికలో ఎలాగైన విజయం సాధించాలని అధికార టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. హుజురాబాద్ మాదిరిగా హడావుడి లేకుండా సైలెంట్గా తన పని చేసుకుపోతోంది. నియోజకవర్గాన్ని యూనిట్లుగా విభజించి మంత్రులు, ఎమ్మెల్యేలను ఇన్ఛార్జులగా నియమించారు ముఖ్యమంత్రి కేసీఆర్. అలాగే గత అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తును పోలిన బుల్డోజర్ తదిరత సింబల్స్ వల్ల ఓటర్లు అయోమయానికి గురయ్యారు. ఈసారి అలాంటి నష్టం కలగకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంది టీఆర్ఎస్.
దీనిలో భాగంగా కారు గుర్తును పోలిన 8 గుర్తులు వున్నాయని.. వాటిని తొలగించాలని ఈ నెల 10 తెలంగాణ ఎన్నికల కమీషనర్కు టీఆర్ఎస్ లేఖ రాసింది. ఎన్నికల గుర్తు జాబితా నుంచి కెమెరా, చపాతి రోలర్, డాలీ, రోడ్ రోలర్, సబ్బు డబ్బా, టీవీ, కుట్టు మిషన్, ఓడను తొలగించాలని విజ్ఞప్తి చేసింది. అయితే ఈసీ నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. దీనిలో భాగంగా సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయాలని ఫిక్సయ్యింది. దీనిపై న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.