
హైదరాబాద్లో బీజీపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించడం, పరేడ్ గ్రౌంగ్స్ ప్రధాని మోదీ బహిరంగ సభ తర్వాత తెలంగాణలో రాజకీయ పరిణామాల్లో మార్పులు చోటుచేసుకున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చి తీరుతుందని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో తమ తదుపరి దృష్టి తెలంగాణపైనే ఉందని, తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవడమే తమ ప్రథమ ప్రాధాన్యమని బీజేపీ అగ్రనేతలు స్పష్టం చేశారు. జాతీయ కార్యవర్గ సమావేశంలో అమిత్ షా ప్రవేశపెట్టిన రాజకీయ తీర్మానం బీజేపీ తదుపరి ఎదుగుదల దక్షిణాది నుంచి కనిపిస్తుందని.. ప్రత్యేకంగా తెలంగాణ, తమిళనాడులో ఉంటుందని స్పష్టంగా పేర్కొంది.
ఈ క్రమంలోనే బీజేపీ ప్రణాళికలను ఎదుర్కొనే విధంగా రాజకీయ వ్యుహాన్ని రచించుకోవాల్సి ఉందని టీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. ఈ అంశంపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసేందుకు టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉంది. టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశాలు జూన్ చివరి వారంలోనే జరగాల్సి ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో వాటిని వాయిదా వేసినట్టుగా తెలిపాయి. ఇక, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో.. తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం రాజకీయ ఎత్తుగడలు, వ్యూహాలను చర్చించి.. వాటికి చెక్ పెట్టేందుకు కౌంటర్ స్ట్రాటజీని సీఎం కేసీఆర్ రూపొందించనున్నట్టుగా తెలుస్తోంది.
ఇక, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేలా టీఆర్ఎస్ ప్రణాళికలు రచించే అవకాశం ఉంది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పరంగా 18 రాష్ట్రాల్లోని డబుల్ ఇంజన్ బీజేపీ ప్రభుత్వాల కంటే.. తెలంగాణలోని సింగిల్ ఇంజన్ టిఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు ఎంత మెరుగ్గా ఉందని ప్రజలకు వివరించేలా కార్యక్రమాలు, ప్రచారం చేపట్టాలని టీఆర్ఎస్ అధినాయకత్వం భావిస్తున్నట్టుగా టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.
జీఎస్డీపీ, తలసరి ఆదాయం, అప్పుల భారం, విద్యుత్ సరఫరా, తాగునీరు, నీటిపారుదల, పారిశ్రామిక వృద్ధి, ఐటీ రంగంలో వృద్ధి, ప్రైవేట్, ప్రభుత్వ రంగాలలో ఉద్యోగాల కల్పన, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, సంక్షేమ పథకాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో డేటాను సేకరించేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది. అలా సేకరించిన డేటాను టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు తో పోల్చి.. ఏది మెరుగైన ప్రభుత్వం నిర్ణయించుకోవాలని ప్రజలను కోరేలా ప్రణాళికలు రచిస్తుంది.
అదే సమయంలో.. బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక పొరుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల ప్రజలు తమ ప్రాంతాలను తెలంగాణలో కలపాలని లేదా తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను తమ రాష్ట్రాల్లో అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారని టీఆర్ఎస్ నాయకత్వం హైలైట్ చేయనుంది.
బీజేపీ అధిష్టానం తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులుకదుపుతున్న నేపథ్యంలో రానున్న టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలను సమీక్షించి బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వాలపై ప్రతివ్యూహాన్ని రూపొందించాలని కేసీఆర్ భావిస్తున్నారు.