ఏపీ ప్రజలు జూ.ఎన్టీఆర్‌‌ను కోరుకుంటున్నారు... లోకేష్‌ను కాదు : ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Dec 22, 2022, 8:34 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. రెండు రాష్ట్రాల్లోనూ చంద్రబాబు ఫెయిల్ అయ్యారని ఆయన ఎద్దేవా చేశారు.
 

తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. లోకేష్‌ను ఫోకస్ చేయాలని చంద్రబాబు చూస్తున్నారని.. కానీ లోకేష్‌ను ఎవరూ కోరుకోవడం లేదని ఎర్రబెల్లి పేర్కొన్నారు. ఎన్టీఆర్ కుటుంబంపై చంద్రబాబుకు ప్రేమ వుంటే.. ఆంధ్రప్రదేశ్‌కు జూనియర్ ఎన్టీఆర్‌ను సీఎంను చేయాలని డిమాండ్ చేశారు ఎర్రబెల్లి. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షుడిగా ప్రజలు కోరుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అప్పుడు చంద్రబాబుకు ఎన్టీఆర్, తెలుగుదేశం మీద ఎంత విశ్వాసం వుందో ప్రజలకు తెలుస్తుందని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ చంద్రబాబు ఫెయిల్ అయ్యారని ఆయన ఎద్దేవా చేశారు.

అంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయాలు తెలంగాణలో చెల్లవన్నారు. టీడీపీకి మళ్లీ ప్రాణం పోయాలనుకుంటే ప్రజలు తిరస్కారిస్తారని చెప్పారు. చుక్కలు ఎన్ని ఉన్నా చందమామ ఒక్కటే ఉన్నట్టే.. ఎన్ని పార్టీలు వచ్చినా తెలంగాణలో కేసీఆర్ ఒక్కరే ప్రజల గుండెల్లో ఉండే వ్యక్తి అని అన్నారు. చంద్రబాబు నాయుడుతో పాటుగా మరెవరూ కూడా ఇక్కడి ప్రజలకు శ్రేయస్సు కాదని అన్నారు. తెలంగాణ ప్రజలు సరైన సమయంలో సరైన సమయంలో తీసుకుంటారని చెప్పారు. 

మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. చంద్రబాబును ఆంధ్రప్రదేశ్ ప్రజలే పాలన బాగోలేదని చిత్తుచిత్తుగా  ఓడించారని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు పాలనలో తెలంగాణ ప్రాంతం అత్యంత దోపిడికి, నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబు హయాంలో అతి ఎక్కువ రైతు ఆత్మహత్యలు జరిగాయని విమర్శించారు. 

ALso REad: బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనే చంద్రబాబు డ్రామాలు.. ఏపీలో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా?: హరీష్ రావు ఫైర్

ఆనాడూ యువత ఉద్యోగాలు, అభివృద్ది గురించి అడిగితే.. నక్సలైట్ల పేరుతో కాల్చి చంపించారని ఆరోపించారు. హైదరాబాద్ ఫ్రీజోన్ పేరుతో ఇక్కడి విద్యార్థుల నోట్లో మట్టి కొట్టిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. రైతులు ఉచిత కరెంట్ ఇవ్వమని హైదరాబాద్‌కు వస్తే.. బషీర్‌బాగ్ చౌరస్తాలో పిట్టల్లాగా కాల్చి చంపిన చరిత్ర చంద్రబాబుది అని విమర్శించారు. రైతులకు ఉచిత కరెంట్ కావాలంటే.. అది సాధ్యం కాదని, తీగలపై బట్టలు ఆరేసుకోవాలని రైతులను అవహేళన చేసిన చరిత్ర చంద్రబాబుది అని విమర్శించారు. చంద్రబాబు దారుణాలను తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేదని అన్నారు. కోడి కుస్తుందంటే అది ఆయన వల్లేనని అనేలా చంద్రబాబు మాట్లాడుతుంటారని.. ఆయన మాటలపై తెలంగాణ ప్రజలకు పూర్తి స్థాయి స్పష్టత ఉందన్నారు.

ఆంధ్రలో చెల్లని రూపాయి.. తెలంగాణలో చెల్లుతుందా? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ గురించి మాట్లాడే హక్కు కూడా చంద్రబాబుకు లేదన్నారు. ఎన్టీఆర్ గురించి మాట్లాడటమంటే.. చెట్టు పేరు చెప్పుకుని కాయాలు అమ్ముకోవడమేనని అన్నారు. ఇప్పుడు ఉన్న తెలుగుదేశం పార్టీ.. ఎన్టీఆర్ పెట్టినప్పుడు ఉన్న పార్టీ కాదని అన్నారు. ఎన్టీఆర్‌కు చంద్రబాబు ఏం చేశాడో తెలుగు ప్రజలు తెలియనది కాదు కదా అని అన్నారు. చంద్రబాబు తెలంగాణలో ఎన్ని డ్రామాలు చేసిన ఆయనకు ఒరిగేదేమి లేదన్నారు

click me!