ప్రారంభమైన తెలంగాణ కేబినెట్ సమావేశం: పీఆర్సీ, లాక్‌డౌన్‌, భూముల విక్రయంపై చర్చ

By narsimha lodeFirst Published Jun 8, 2021, 2:20 PM IST
Highlights

తెలంగాణ కేబినెట్ సమావేశం మంగళవారం నాడు మధ్యాహ్నం ప్రగతిభవన్ లో ప్రారంభమైంది. లాక్‌డౌన్‌తో పాటు ఉద్యోగుల పీఆర్సీతో పాటు ప్రభుత్వ భూముల అమ్మకంపై  కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. 

హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ సమావేశం మంగళవారం నాడు మధ్యాహ్నం ప్రగతిభవన్ లో ప్రారంభమైంది. లాక్‌డౌన్‌తో పాటు ఉద్యోగుల పీఆర్సీతో పాటు ప్రభుత్వ భూముల అమ్మకంపై  కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకుగాను ఈ ఏడాది మే  12వ తేదీ నుండి రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. తొలుత ఉదయం  6 గంటల నుండి 10 గంటల వరకు  లాక్‌డౌన్ ఆంక్షలకు మినహాయింపు ఉండేది.  మే నెలాఖరు వరకు లాక్‌డౌన్ ను పొడిగించారు. అయితే గత మాసం చివర్లో నిర్వహించిన కేబినెట్ సమావేశంలో  లాక్‌డౌన్ ను  జూన్ 9వ తేదీకి పొడిగించింది ప్రభుత్వం. అయితే లాక్‌డౌన్ ఆంక్షలకు   ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటలకు మినహయింపు ఇచ్చారు. 

also read:లాక్‌డౌన్ పొడిగిస్తారా, ఎత్తేస్తారా?:నేడు తెలంగాణ కేబినెట్ భేటీ

రాష్ట్రంలో కరోనా కేసుల వ్యాప్తి తగ్గింది.గత 24 గంటల్లో రాష్ట్రంలో 1933 కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ మాసంతో పోలిస్తే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. అయితే ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో  కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. దీంతో థర్డ్ వేవ్ విషయంలో  వైద్య ఆరోగ్య శాఖ సన్నద్దతపై కూడ కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు.రాష్ట్రంలో లాక్‌డౌన్ ను కొనసాగించాలా, ఎత్తివేయాలా అనే విషయమై కూడ నిర్ణయం తీసుకోనున్నారు. లాక్‌డౌన్ మినహాయింపులను  సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగించే  విషయమై చర్చించనున్నారు. పగలు పూట లాక్‌డౌన్ ఎత్తివేసి రాత్రిపూట కర్ఫ్యూను కొనసాగించే విషయమై కూడ ఈ సమావేశంలో చర్చించనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ చేయాలని  ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. వేతన సవరణకు సంబంధించి ఆర్ధికశాఖ ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదికను సమర్పించింది. ఈ నివేదికకు కేబినెట్ ఇవాళ ఆమోదముద్ర వేయనుంది. పీఆర్సీ నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపితే ఇవాళ లేదా రేపు ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.ఇంటర్ సెకండియర్ పరీక్షలతో పాటు  రేపటి నుండి ప్రారంభించనున్న డయాగ్నస్టిక్ సెంటర్లపై కేసీఆర్ మంత్రులకు దిశానిర్ధేశం చేయనున్నారు.రైతు బందు పథకంతో పాటు వ్యవసాయ పనులు ప్రారంభమౌతున్న తరుణంలో  కల్తీ విత్తనాలు, ఎరువులను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడ చర్చించనున్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వ భూముల విక్రయంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. భూముల విక్రయం ద్వారా సుమారు రూ. 50 వేల కోట్ల నిధులను సమకూర్చుకోవాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది.కరోనా నేపథ్యంలో ఆర్ధిక ఇబ్బందుల నుండి గట్టెక్కడానికి  భూముల విక్రయం  చేపట్టాలని  ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయమై కేబినెట్ లో చర్చించనున్నారు. 
 

click me!