
తెలంగాణ బీజేపీలో గ్రూప్ రాజకీయాలు మరోసారి బయటపడ్డాయి. తాజాగా హైదరాబాద్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో పలువురు అసమ్మతి నేతలు రహస్యంగా భేటీ అయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు వ్యతిరేకంగా ఆ పార్టీ అసమ్మతి నేతలు ఈ సమావేశం నిర్వహించారు. గతంలో భేటీ అయిన నేతలే మరోసారి ఈ రహస్య భేటీలో పాల్గొన్నారు. కరీంనగర్కు చెందిన నేతలతో పాటు హైదరాబాద్ నుంచి కొందరు నేతలు పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. ఈ రహస్య సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, సుగుణాకర్, వెంకటరమణి, రాములు పాల్గొన్నట్టుగా సమాచారం. అయితే గతంలో కరీంనగర్లో ఇలాంటి సమావేశమే చోటుచేసుకోగా.. హైకమాండ్ సీరియస్ అయింది.
ఈ వ్యవహారానికి సంబంధించి.. బీజేపీ జాతీయ నాయకత్వం ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డిని రంగంలోకి దింపింది. దీంతో ఆయన అసంతృప్త నేతల్ని హైదరాబాద్ పిలిపించి మాట్లాడారు. దీంతో అంతా సర్దుకుంటుందని అంతా భావించారు. అయితే అసంతృప్త నేతలు మాత్రం తగ్గేదెలే అన్నట్టుగా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తాము పార్టీ కోసం కష్టపడ్డామని.. కానీ తమను అవమానాలకు గురిచేస్తున్నట్టుగా సన్నిహితుల వద్ద వాపోతున్నారు. ఈ క్రమంలోనే వారు నేడు మరోసారి సీక్రెట్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది.
తెలంగాణలో దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో విజయం, గ్రేటర్ హైదరబాద్లో మంచి ఫలితాలు సాధించిన బీజేపీ.. టీఆర్ఎస్పై పోరును ముమ్మరం చేసింది. అంతేకాకుండా క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తుంది. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇలాకాలోనే లుకలుకలు బయటపడడం చర్చనీయాంశంగా మారింది. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. కొత్తవారికి ఇచ్చిన గౌరవం కూడా ఇవ్వడం లేదని అసమ్మతి నేతలు వాపోతున్నట్లు తెలుస్తోంది. తమకు పార్టీలో గుర్తింపు దక్కడం లేదని ఆత్మగౌరవ నినాదంతో వీరు సమావేశాలు నిర్వహించినట్టుగా సమాచారం. మరి తాజా భేటీ తర్వాత పరిణామాలు ఏ విధమైన మలుపు తిరుగుతాయో వేచిచూడాల్సి ఉంది.