ఎంత వరకు నిజం: బీజేపీలోకి తీగల కృష్ణా రెడ్డి?

By telugu teamFirst Published Nov 6, 2020, 2:47 PM IST
Highlights

టీఆర్ఎస్ నేత తీగల కృష్ణా రెడ్డి బిజెపిలో చేరుతారంటూ ముమ్మరంగా ప్రచారం సాగుతోంది. గత కొంత కాలంగా కృష్ణా రెడ్డి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఇందులో నిజమెంత ఉందనేది ప్రశ్న.

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్‌కు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి షాకివ్వనున్నారా ప్రశ్న ఉదయిస్తోంది. పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారప్రచారం జోరుగా సాగుతోంది.. కారు దిగి కమలం గూటికి చేరుతున్నట్టు చెబుతున్నారు. ఈ మేరకు బీజేపీ నేతలతో ఆయన చర్చలు జరుపుతున్నారని కూడా ప్రచారం సాగుతోంది. 

గత కొంతకాలంగా టీఆర్‌ఎస్‌కు దూరంగా ఉంటూ వస్తున్నారు. తీగల కృష్ణారెడ్డి. మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ.. టీఆర్‌ఎస్‌ అసంతృప్తులకు గాలం వేస్తోంది. ఈ నేపథ్యంలో తీగల కృష్ణారెడ్డితో బీజేపీ సీనియర్ నేతలు చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే తీగలతో మంత్రి మల్లారెడ్డి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచిన తీగల కృష్ణారెడ్డి.. కొద్దిరోజులకే గులాబీ కండువా కప్పుకున్నారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి గెలుపొందారు. 

అయితే ఆమె సైతం కారెక్కడంతో.. తీగలకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయని అంటున్నారు. అయితే ఆయనకు ఎమ్మెల్సీ సీటు గ్యారంటీ అన్న భరోసా పార్టీ అగ్రనేతల నుంచి రావడంతో కాస్త శాంతించారు. కానీ ఇప్పటి వరకు ఆయనకు ఎలాంటి పదవీ దక్కకపోవడంతో పార్టీ మారడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.

కాగా, తాను పార్టీ మారడం లేదని తీగెల కృష్ణా రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. తాను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే ఉంటానని స్పష్టం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

click me!