ముస్లిం కరోనా రోగులకు.. కేసీఆర్ రంజాన్ ఆఫర్

By telugu news teamFirst Published Apr 24, 2020, 2:06 PM IST
Highlights

రంజాన్ రోజుల్లో ముస్లింల ఇళ్లల్లో తయారయ్యే వంటకాల మాదిరిగానే ఐసొలేషన్ వార్డులు, క్వారంటైన్లలో ఉండే వారికి రంజాన్ స్పెషల్ ఫుడ్‌ను అందించబోతోంది.

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ ప్రభావం తెలంగాణలోనూ బాగా కనపడుతోంది. లాక్ డౌన్ విధించినప్పటికీ.. కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు దాదాపు వెయ్యికి చేరుకున్నాయి.

దీంతో కరోనా సోకినవారందరికీ ప్రత్యేకంగా ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. అయితే.. ప్రస్తుతం రంజాన్ మాసం కావడంతో.. కరోనా సోకిన ముస్లిం రోగులకు సీఎం కేసీఆర్ ఓ ఆఫర్ ప్రకటించారు.

రంజాన్ రోజుల్లో ముస్లింల ఇళ్లల్లో తయారయ్యే వంటకాల మాదిరిగానే ఐసొలేషన్ వార్డులు, క్వారంటైన్లలో ఉండే వారికి రంజాన్ స్పెషల్ ఫుడ్‌ను అందించబోతోంది. ఉపవాస దీక్ష ఆరంభానికి ముందు.. విరమించిన తరువాత వారికి వెజ్, నాన్ వెజ్ వంటకాలతో కూడిన భోజనాన్ని వడ్డించబోతోంది. శనివారం నుంచి ఈ రంజాన్ మెనూ అందుబాటులోకి రానుంది.

కరోనా వైరస్ బారిన పడిన ముస్లిం పేషెంట్లు తెల్లవారు జామున 3:30 గంటల సమయంలో ఉపవాస దీక్షను ఆరంభిస్తుంటారు. ఆ సమయంలో వారికి షెహరిగా రొట్టెలు, వెజ్ కర్రీ, దాల్ అందిస్తారు. సాయంత్రం ఉపవాస దీక్షను విరమించే సమయంలో ఇఫ్తార్‌గా ఖిచిడి, చికెన్ కర్రీ, బగారా రైస్, దాల్చా, వెజ్ బిర్యాని, చికెన్ బిర్యానీని అందిస్తారు. 

మటన్ కర్రీ లేదా చికెన్ కర్రీని రోజు విడిచి రోజు వడ్డిస్తారు. అలాగే ఉపవాస దీక్షను విరమించిన తరువాత అల్పాహారంగా ఖర్జూరం, అరటిపండ్లు, ఇతర పండ్లను అందిస్తారు. ఈ నెల రోజులూ ఇదే రకమైన ఆహారాన్ని అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.

click me!