భార్యపై దాడి చేసిన మణుగూరు ఎస్సైపై కేసు

By Arun Kumar PFirst Published Aug 31, 2018, 12:16 PM IST
Highlights

భార్యా, అత్తలపై దాడికి పాల్పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎస్సైపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు అతడిపై 498(ఎ), 323 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
 

భార్యా, అత్తలపై దాడికి పాల్పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎస్సైపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు అతడిపై 498(ఎ), 323 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

మణుగూరులో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న జితేందర్ ప్రేమించి మరీ 2005 లో పర్వీన్ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. కులాలు వేరైనప్పటికి ఇద్దరూ ఇష్టపడటంతో ఈ వివాహానికి ఎవరూ అడ్డుచెప్పలేదు. అయితే మొదట్లో బాగానే వున్న జితేందర్ ఆ తర్వాత తన నిజస్వరూపం బైటపెట్టాడు. భూపాల పల్లిలో విధులు నిర్వహించే సమయంలో పరిచయమైన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలియడంతో భార్యాభర్తలకు గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి.

అయితే ఈ క్రమంలోనే పర్వీన్ గర్భం దాల్చడంతో ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లింది. దీంతో జితేందర్ మరింత మితిమీరాడు. భార్యను అసలు పట్టించుకోవడం మానేశాడు. బిడ్డ పుట్టినా చూడటానికి రాలేడు. దీంతో భార్య పర్వీన్ తన తల్లితో పాటు  మహిళా సంఘాలను తీసుకుని జితేందర్ ఇంటికి వెళ్లింది. అందరి ముందు భార్య పర్వీన్ భర్త జితేందర్ ను అక్రమ సంబంధం గురించి నిలదీసింది. దీంతో కోపోద్రిక్తుడైన ఎస్సై భార్యను చితకబాదాడు. దీన్ని అడ్డుకోడానికి ప్రయత్నించిన అత్తపై కూడా విచక్షణారహితంగా దాడి చేశాడు. అనంతరం అక్కడి నుండి పరారయ్యాడు.

ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన బాధితులు మహిళా సంఘాల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడు దాడికి పాల్పడిన వీడియోలను పోలీసుల ముందుంచారు. దీంతో ఎస్సైపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తల కోసం కింది లింక్స్ పై క్లిక్ చేయండి

అక్రమ సంబంధంపై ప్రశ్నించిన భార్యా, అత్తలపై దాడిచేసిన ఎస్సై (వీడియో)

click me!