ప్రగతి భవన్ లో మూడు రాష్ట్రాల సీఎంలతో కేసీఆర్ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్: జాతీయ రాజకీయాలపై చర్చ

By narsimha lodeFirst Published Jan 18, 2023, 10:05 AM IST
Highlights

మూడు రాష్ట్రాల సీఎంలు, ఇతర ప్రముఖలతో  తెలంగాణ సీఎం  కేసీఆర్  ప్రగతి భవన్ లో  బ్రేక్ ఫాస్ట్ భేటీ నిర్వహించారు.  జాతీయ రాజకీయాలపై  నేతలతో  కేసీఆర్  చర్చించారు.

హైదరాబాద్: ప్రగతి భవన్ లో  తెలంగాణ సీఎం కేసీఆర్ తో  మూడు రాష్ట్రాల సీఎంలు , యూపీ మాజీ సీఎం  అఖిలేష్ యాదవ్ , సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి  బుధవారం నాడు భేటీ అయ్యారు.  మూడు రాష్ట్రాల సీఎంలు,  ఇతర నేతలతో  కేసీఆర్ బ్రేక్ ఫాస్ట్  మీటింగ్  నిర్వహించారు.

ఖమ్మంలో  నిర్వహించే  బీఆర్ఎస్ బహిరంగ సభలో పాల్గొనేందుకు  గాను  మూడు రాష్ట్రాల సీఎంలు , సమాజ్ వాదీ పార్టీ చీఫ్   అఖిలేష్ యాదవ్ , సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజాలు  నిన్న రాత్రే  హైద్రాబాద్ కు  చేరుకున్నారు.  ప్రత్యేక విమానంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్,  పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ లు వచ్చారు . వీరిద్దరికి  తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి  మహమూద్ అలీ  స్వాగతం పలికారు.  యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కు  తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  స్వాగతం పలికారు.  కేరళ సీఎం పినరయి విజయన్ కు  తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్వాగతం పలికారు. 

ఇవాళ  ఉదయం  ప్రగతి భవన్ లో  మూడు రాష్ట్రాల సీఎంలు, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ లకు  కేసీఆర్  అల్పాహర విందు ఇచ్చారు.  బీఆర్ఎస్ ఏర్పాటు , జాతీయ రాజకీయాలపై  నేతలతో  కేసీఆర్  చర్చించనున్నారు.

బీఆర్ఎస్ ఏర్పాటు తర్వాత  ఖమ్మంలో  నిర్వహిస్తున్న ఈ సభను కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సుమారు  ఐదు లక్షల జనాన్ని సమీకరించాలని   ఆ పార్టీ నాయకత్వం  నిర్ణయం తీసుకుంది.  ఈ  సభ  ఏర్పాట్లపై మంత్రులు  హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ లకు  బాధ్యతలు అప్పగించారు కేసీఆర్.  ఖమ్మంలోనే మకాం వేసి  హరీష్ రావు  వారం రోజులుగా  సభ నిర్వహణకు  ఏర్పాట్లు చేస్తున్నారు.
 

click me!