
హైదరాబాద్: నిమ్స్ లో చికిత్సపొందుతున్న కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి, ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు వంశీచంద్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి శనివారం పరామర్శించారు. శుక్రవారం పోలింగ్ సమయంలో ఎన్నికల సరళిని పరిశీలించేందుకు జంగా రెడ్డిపల్లె పోలింగ్ బూత్ కు వెళ్లారు.
ఆ సమయంలో బీజేపీ కార్యకర్తలకు, వంశీచంద్ రెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం బీజేపీ నేతలు రాళ్లదాడికి పాలవ్వడంతో వంశీచంద్ రెడ్డి గాయాలపాలయ్యారు. ప్రత్యర్థుల దాడిలో గాయపడిన వంశీచంద్ను హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
నిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆయన్ను పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పలువురు కాంగ్రెస్ నేతలు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సరికాదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆక్షేపించారు.