హరీష్, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఇళ్లలోనూ సోదాలు: తలసాని

By Arun Kumar PFirst Published Oct 27, 2020, 7:28 PM IST
Highlights

టీఆర్ఎస్ ప్రభుత్వమే పోలీసుల చేత తమపై దాడులు చేయిస్తోందని అంటున్న నాయకులు మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, దుబ్బాక అభ్యర్థి సుజాత ఇంట్లో కూడా సోదాలు జరిగిన విషయాన్ని గమనించాలన్నారు.  
 

హైదరాబాద్:  నిన్నటి(సోమవారం) నుండి దుబ్బాక, సిద్దిపేట ఎపిసోడ్ మొత్తాన్ని చూస్తున్నానని... జితేందర్ రావు ఇంట్లో సోదాలతో బిజెపి డ్రామాలు మొదలయ్యాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అయితే ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతాయన్న విషయాన్ని బిజెపి నాయకులు తెలుసుకోవాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వమే పోలీసుల చేత తమపై దాడులు చేయిస్తోందని అంటున్న నాయకులు మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, దుబ్బాక అభ్యర్థి సుజాత ఇంట్లో కూడా సోదాలు జరిగిన విషయాన్ని గమనించాలన్నారు.  

 ''బీజేపీ నేతలు నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మీ క్యాడర్ ఎంత బలం ఎంత. మా క్యాడర్ 60 లక్షలు. సీఎం క్యాంప్ ఆఫీస్ అయిన ప్రగతిభవన్ ను ముట్టడి చేస్తాం అంటున్నారు ఇలాగే మా వాళ్ళు చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి'' అంటూ బిజెపి నాయకులను హెచ్చరించారు తలసాని. 

''బిజెపి ఎంపీ బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా వెళ్లి నానా హైరానా చేశారు. అయితే పోలీసులు సెర్చ్ చేసి డబ్బులు తీశారు. డబ్బులు సీజ్ చేసి తీసుకొస్తుంటే బిజెపి కార్యకర్తలు పోలీసుల చేతిలో నుండి లాక్కొని వెళ్లారు. 5 లక్షలు అపహరణకు గురైంది. అది పెద్ద క్రైమ్'' అని అన్నారు. 

''మాకు మెజారిటీ ఖచ్చితంగా వస్తుంది. ప్రజలే మాకు బాసులు. మేము చేసిన అబివృద్ది సంక్షేమ ఫలాలు మాకు గెలుపుని ఇస్తుంది. బీజేపీ నేతలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. హైదరాబాద్ లో వరదలతో నగరవాసులు ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురయ్యారు. కానీ ఇప్పటికీ కేంద్రం నుండి రూపాయి సహాయం అందలేదు. జీఎస్టీ నిధులే రాలేదు'' అంటూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై మండిపడ్డారు. 

'' ఇవాళ ఉదయం నుండి బీజేపీ నేతలు  ఏకవచనంగా ఏదో ఏదో మాట్లాడుతున్నారు. దొంగతనం మీరు చేసి మాపై వేస్తున్నారు. ఇది బలుపు కాకపోతే మరెంటి? బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిజానిజాలు తెలుసుకోకుండా అక్కడికి వెళ్లి ఏం చేశారు'' అంటూ తలసాని ప్రశ్నించారు. 
 

click me!