ఆగస్టు 5వ తేదీన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. రావిర్యాల, మహేశ్వరం, తుక్కుగూడ ప్రజలకు నైపుణ్యంతో పాటు ఉపాధికీ అవకాశాలు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సోలార్, విండ్ వంటి పునరుత్పాదక శక్తికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కేటీఆర్ వివరించారు.
గడిచిన ఏడేళ్లలో తెలంగాణ రాష్ట్రం 15 వేల పైచిలుకు పరిశ్రమలను.. 2 లక్షల 20 వేల కోట్ల పెట్టుబడులను సాధించుకుందని మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం మహేశ్వరంలో ఉన్న ఈ-సిటీలో ప్రముఖ సోలార్ పరికరాల తయారీ కంపెనీ ప్రీమియర్ ఎనర్జీస్ నూతన ప్లాంట్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రూ.483 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టు(సరికొత్త ప్రాజెక్టు) ఏర్పాటు చేసిన ప్రీమియర్ ఎనర్జీస్ రెండేళ్లలో పెట్టుబడులను రూ.1200 కోట్లకు పెంచనున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇందులో 80 శాతానికి పైగా పరిశ్రమలు ఇప్పటికే పని ప్రారంభించడం అసాధారణమని ప్రశంసించారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉందని కేటీఆర్ వివరించారు.
ఆగస్టు 5వ తేదీన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభిస్తామని మంత్రి అన్నారు. రావిర్యాల, మహేశ్వరం, తుక్కుగూడ ప్రజలకు నైపుణ్యంతో పాటు ఉపాధికీ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. సోలార్, విండ్ వంటి పునరుత్పాదక శక్తికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కేటీఆర్ వివరించారు. 2023 కల్లా 4 గిగా వాట్ల సామర్థ్యంతో సోలార్ మాడ్యుల్స్, సోలార్ సెల్స్ ఏర్పాటు చేసేందుకు ప్రీమియర్ ఎనర్జీస్ కంపెనీ ప్రణాళికలున్నాయని మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.