విదేశీ వధువు చేతిలో మోసపోయిన యువకుడు.. రూ. 5 లక్షలకు టోకరా..

By AN TeluguFirst Published Dec 8, 2020, 4:03 PM IST
Highlights

విదేశీ వరుల పేరుతో మ్యాట్రిమోనియల్ మోసాలు, మహిళలు మోసపోవడం తరచుగా వింటూనే ఉంటాం. అయితే ఈ కేసుల్లో ఎప్పుడూ పాపం యువతులే మోసపోతుంటారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. విదేశీ పెళ్లికూతురి చేతిలో దేశీ పెళ్లికొడుకు మోసపోయాడు.

విదేశీ వరుల పేరుతో మ్యాట్రిమోనియల్ మోసాలు, మహిళలు మోసపోవడం తరచుగా వింటూనే ఉంటాం. అయితే ఈ కేసుల్లో ఎప్పుడూ పాపం యువతులే మోసపోతుంటారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. విదేశీ పెళ్లికూతురి చేతిలో దేశీ పెళ్లికొడుకు మోసపోయాడు.
 
వివరాల్లోకి వెడితే.. విదేశీ వధువు వల్లో పడిన ఓ నగర వాసి రూ.5 లక్షలు పోగొట్టుకున్నాడు. బాధితుడు సోమవారం సిటీ సైబర్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

నగరంలోని బర్కత్‌పురా కు చెందిన ఓ వ్యక్తి బాగా చదువుకున్నాడు. పెళ్లి చేసుకోవాలనుకుని సంగం.కామ్‌ అనే మాట్రిమోనియల్‌ సైట్‌లో రిజిస్టర్‌ చేసుకున్నాడు. ఆ మ్యాట్రిమోనియల్ సైట్ లో రీటా గా రిజిస్టర్ చేసుకున్న యువతితో పరిచయం అయ్యింది. 

తాను అమెరికాలో డాక్టర్‌గా పని చేస్తున్నానంటూ ఆమె చాటింగ్‌లో చెప్పింది. ఇలా వీరి పరిచయం పెరిగిన తర్వాత సదరు రీటా ఇతని దగ్గర పెళ్లి ప్రస్తావన కూడా తెచ్చింది. హఠాత్తుగా ఓ రోజు మన పరిచయానికి గుర్తుగా కొన్ని గిఫ్ట్‌లు పంపిస్తున్నానంటూ సందేశం పంపింది. ఆపై రెండు రోజులకు ఢిల్లీ విమానాశ్రయం కస్టమ్స్‌ అధికారులుగా చెప్పుకుంటూ కొందరు నగర వాసికి కాల్‌ చేశారు.  

అమెరికా నుంచి మీ పేరుతో ఓ పార్శిల్‌ వచ్చిందని చెప్పారు. అందులో ఖరీదైన గిఫ్ట్‌లతో పాటు కొన్ని డాలర్లు సైతం ఉన్నట్లు గుర్తించామన్నారు. వీటిని హైదరాబాద్‌కు పంపాలంటే కస్టమ్స్‌ క్లియరెన్స్‌ తప్పనిసరని చెప్పారు. దానికోసం కొన్ని ట్యాక్సులు కట్టాల్సి ఉంటుందంటూ దఫదఫాలుగా బాధితుడి వద్ద నుంచి రూ.5 లక్షలు వివిధ బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయించారు.  

చివరికి తాను మోసపోయాననే విషయం గుర్తించిన బాధితుడు సోమవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. రీటాగా చెప్పుకున్న మహిళ +11తో మొదలయ్యే నంబర్‌తో వాట్సాప్‌ చాటింగ్‌ చేసింది. బాధితుడు డబ్బు బదిలీ చేసిన బ్యాంకు ఖాతాలన్నీ ఢిల్లీలో, సోనియా శర్మ పేరుతో ఉన్నాయి. వీటి ఆధారంగా సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

click me!