కరోనా కట్టడికి ఆలోచన: 15 నుంచి తెలంగాణలో లాక్ డౌన్?

By telugu teamFirst Published May 11, 2021, 8:37 AM IST
Highlights

తెలంగాణలో ఈ నెల 15వ తేదీన నుంచి లాక్ డౌన్ విధించే ఆలోచనలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా కట్టడికి అది తప్ప మార్గం లేదని కేసీఆర్ ఆలోచనగా చెబుతున్నారు.

హైదరాబాద్: రాష్ట్రంలో లాక్ డౌన్ విధించే అలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మే 15వ తేదీ నుంచి సంపూర్ణంగా లాక్ డౌన్ విధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంటే, రంజాన్ మర్నాటి నుంచి ఈ లాక్ డౌన్ అమలులోకి వస్తుంది. కర్ఫ్యూ విధించినప్పటికీ కరోనా కట్టడి కాకపోవడంతో లాక్ డౌన్ విధించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. 

ఈ రోజు మధ్యాహ్నం జరిగే మంత్రివర్గ సమావేశంలో లాక్ డౌన్ మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పలు రాష్ట్రాలు ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించాయి. అయితే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు మాత్రం కర్ప్యూ విధించాయి. తెలంగాణలో రెండు వారాలుగా రాత్రిపూట కర్ఫ్యూ అమలు అవుతోంది. లాక్ డౌన్ విధిస్తే ప్రజా జీవనం స్తంభించడంతో పాటు ఆర్థిక వ్యవస్థ కూలిపోయే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 6వ తేదీన అన్నారు. 

దాంతో ఈ నెల 15వ తేదీ వరకు తెలంగాణ ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూను పొడగించింది.  లాక్ డౌన్ అమలుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ కేసీఆర్ మాత్రం కచ్చితంగానే ఉన్నట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ విధించడానికే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18 గంటల పాటు కర్ఫ్యూ అమలు అవుతోంది. 

కర్ఫ్యూలేని పగటి కాలంలో ప్రజలు స్వీయ నియంత్రణ పాటించకోపవడం, హెచ్చరిస్తున్నా మాస్కులు ధరించకపోవడం వంటి కారణాల వల్ల కరోనా అదుపు కావడం లేదని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో లాక్ డౌన్ మాత్రమే పరిష్కారమని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో 10 నుంచి 24వ తేదీ వరకు, కేరళలో ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు లాక్ డౌన్ విధించారు. రాజస్థాన్ లో ఈ నెల 10 నుంచి 24వ తేదీ వరకు లాక్ డౌన్ అమలవుతోంది. బీహార్ లో ఈ నెల 4 నుంచి 15వ తేదీ వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుంది.  ఢిల్లీలో ఏప్రిల్ 19 నుంచి లాక్ డౌన్ అమలవుతోంది. మహారాష్ట్రలో ఏప్రిల్ 5వ తేదీ నుంచి లాక్ డౌన్ అమలవుతోంది. 

click me!