తెలంగాణలో కేసీఆర్ ఓ సింహమని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఆ సింహాన్ని ఓడించేందుకు నాలుగు పార్టీలు కుమ్మక్కు అయ్యాయని ఆరోపించారు. సింహం సింగిల్ గానే వస్తుంది రాబోయే ఎన్నికల్లో సింహం లాంటి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు.
హైదరాబాద్: తెలంగాణలో కేసీఆర్ ఓ సింహమని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఆ సింహాన్ని ఓడించేందుకు నాలుగు పార్టీలు కుమ్మక్కు అయ్యాయని ఆరోపించారు. సింహం సింగిల్ గానే వస్తుంది రాబోయే ఎన్నికల్లో సింహం లాంటి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. మహేశ్వరం నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొన్న కేటీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఓల్డ్ సిటీ అభివృద్ధి చెందిందన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో మాకు మజ్లిస్ పార్టీతో మాత్రమే స్నేహం ఉందని ఏ పార్టీతో లేదని కేటీఆర్ తేల్చి చెప్పారు. ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాకు మంచి స్నేహితుడని తెలిపారు. ఓవైసీ ముందు నుంచి టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నారని తెలిపారు. నాలుగున్నరేళ్ల కాలంలో కేసీఆర్ ఏనాడు హిందూ, ముస్లిం అంటూ బేధాలు చూపించలేదన్నారు.
తాము ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో కలవమని నరేంద్రమోదీతో అసలు దోస్తీయే చెయ్యబోమని కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి పొరపాటున కూడా ఓటెయ్యోద్దని కోరారు. ఓటేస్తే మళ్లీ పాత కష్టాలే వస్తాయని తెలిపారు.
మైనార్టీల సంక్షేమం కోసం టీఆర్ఎస్ పార్టీ పాటు పడిందని చెప్పుకొచ్చారు. మైనార్టీ సంక్షేమం కోసం ఆనాడు ఉమ్మడ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.200కోట్లు కేటాయిస్తే తమ పార్టీ రూ.2వేల కోట్లు కేటాయించిందని తెలిపారు.
బంగారు తెలంగాణ కేవలం టీఆర్ఎస్ తోనే సాధ్యమని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. తీగల కృష్ణారెడ్డిని గెలిపించి కేసీఆర్ ప్రభుత్వాన్ని బలపరచాలని కోరారు. నాలుగున్నరేళ్లుగా పాతబస్తీలో రూ.55కోట్ల రూపాయలతో మంచినీరు అందించామన్నారు.
టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అభివృద్ధి చెందిందని కేటీఆర్ తెలిపారు. 50ఏళ్ల కాంగ్రెస్,టీడీపీల పాలనలో చేయని అభివృద్ధి కేవలం నాలుగేళ్లలో చేసి నిరూపించారన్నారు. తెలంగాణలో మతకల్లోలాలు లేవని, మాఫియా లేదని, కర్ఫ్యూ లేదన్నారు. ముఖ్యమంత్రి పదవుల కోసం పాతబస్తీలో మారణ హోమం సృష్టించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కేటీఆర్ విమర్శించారు.