హైదరాబాదులో దారుణం: మహిళపై కార్పోరేటర్ అత్యాచారం

By telugu teamFirst Published May 2, 2021, 6:40 AM IST
Highlights

హైదరాబాదులో ఓ కార్పోరేటర్ అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. జవహర్ నగర్ కార్పోరేటర్ పల్లవు రవి ఓ మహిళపై అత్యాచారం చేయడమే కాకుండా ఆమెను బెదిరించాడు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో దారుణం జరిగింది. ఓ కార్పోరేటర్ మహిళపై అత్యాచారం చేశాడు. ఇంటి నిర్మాణంలో సహాయం చేయాలని కోరిన మహిళపై అతను లైంగిక దాడి చేసి, బెదరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాదులోని జవహర్ నగర్ లో చోటు చేసుకుంది. 

ఇంచార్జీ ఇన్ స్పెక్టర్ పాండురంగారెడ్డి అందుకు సంబంధించన వివరాలను వెల్లడించారు. హైదరాబాదులోని ఓ కుటుంబం మూడేళ్ల క్రింత జవహర్ నగర్ లోని బిజేఆర్ నగర్ లో 115 గజాల స్థలాన్ని రూ.7.11 లక్షలకు కార్పోరేటర్ పల్లపు రవి వద్ద నోటరీ ద్వారా కొనుగోలు చేసింది. 

ఆ కుటుంబం అప్పట్లో ఓ గది నిర్మాణాన్ని చేపట్టింది. అయితే, సమస్యలు తలెత్తడంతో మధ్యలోనే నిర్మాణాన్ని ఆపేసింది. దాన్ని పూర్తి చేయాలని ఆ కుటుంబం కార్పోరేటర్ ను ఆశ్రయించింది. దాన్ని పూర్తి చేసే విధంగా రూ.2 లక్షలకు నోటి మాట ద్వారా ఒప్పందం చేసుకున్నారు. రూ. 50 వేలు అడ్వాన్స్ కూడా చెల్లించారు 

శుక్రవారం మధ్యాహ్నం ఆ కుటుంబానికి చెందిన మహిళ నిర్మాణం వద్దకు చేరుకుంది. కార్పోరేటర్ రవి అక్కడికి వచ్చి ఆమె చేయి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. తన కోరిక తీర్చాలని అడిగాడు. దానికి ఆమె నిరాకరించింది. అయితే, అతను బలవంతంగా ఆమెను గదిలోకి లాక్కుని వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. 

అతని నుంచి తప్పించుకున్న మహిళ బస్టాపు వైపు వెళ్తుండగా, కార్పోరేటర్ ఆమెను అనుసరించి, బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు శనివారం కార్పోరేటర్ మీద అత్యాచారం కింద మాత్రమే కాకుండా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద కూడా పోలీసులు కేసు పెట్టారు.

click me!